Nara Lokesh : సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మంగళవారం హైదరాబాద్లో నారా లోకేశ్ను కలిశారు. టీడీపీలో చేరేందుకు లోకేశ్ తో ఆయన కుమారుడితో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం . ఇటీవల మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపనలు చేసిన ఆదిమూలం పార్టీ మారనున్నట్లు తెలిసింది .
సత్యవేడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం స్థానంలో ఈ సారి తిరుపతి ఎంపీ గురుమూర్తిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని వైసీపీ అధిస్టానం భావించింది. అదే సమయంలో ఆదిమూలంను తిరుపతి లోక్సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. ఎమ్మెల్యేగా ఉండటానికే మొగ్గుచూపిన ఆదిమూలం సడన్గా అధిష్టానాన్ని ధిక్కరించేలా మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో ఏర్పాటు చేసిన సత్యవీడు నాయకుల ఆత్మీయ సభకు మంత్రి పెద్దిరెడ్డి ఆహ్వానించలేదని ఆదిమూలం తీవ్ర ఆరోపనలు చేశారు. అంతేకాకుండా తన నియోజకవర్గంలో ఇసుక దందా వెనక పెద్దిరెడ్డి ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ సందర్భంలోనే లోకేశ్ తో ఆదిమూలం భేటీ అవ్వడంతో త్వరలో టీడీపీలోకి చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.