Ministers Fire on YS Jagan : విజయవాడ వరద బాధితులకు అందించిన సాయంపై ఏపీలో అధికార, విపక్షాల నడుమ విమర్శలు తారాస్థాయికి చేరాయి. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేస్తే, గత వైసీపీ ప్రభుత్వం ఎగ్ పఫ్ లకు ఖర్చు చేసిందని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. సచివాలయంలో మంత్రి నారాయణ, అనగాని సత్య ప్రసాద్ తో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీది ఫేక్ బుద్ధి, ఫేక్ ప్రచారం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “విజయవాడ వరద బాధితులకు సాయం కోసం రూ.602 కోట్లు ఖర్చు చేశాం. అవినీతి చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని రోడ్లు మీదకు రానిచ్చేవాళ్లు కాదు. విజయవాడ వరదల్లో టీం వర్క్ తో పని చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టరేట్ లో ఉండి వరద సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించారు. వైసీపీ నేతలకు వాస్తవాలు తెలిసినా, మందలా వచ్చి ఆరోపణలు చేస్తున్నారు” అంటూ మండిపడ్డారు.
ముందు ఎగ్ పఫ్ ల లెక్క చెప్పండి – మంత్రి అనిత
జగన్ ప్రభుత్వ హయాంలో ఎగ్ పఫ్ లకు తగలేసినట్లు తాము ప్రజా సొమ్ముకు ఖర్చు దుబారా చేయట్లేదని అనిత విమర్శించారు. “మేం జగన్ ప్రభుత్వంలా చేయం. ఎగ్ పఫ్ లకు లక్షలు ఖర్చు చేసినట్లు చేయం. మా ప్రభుత్వం ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తుంది. వరద బాధితుల గ్యాస్ స్టవ్ లు కూడా బాగు చేయించిన ప్రభుత్వం మాది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ ఏనాడు హెలీకాప్టర్ దిగలేదు. కానీ, విజయవాడ వరద బాధితుల దగ్గరికి చంద్రబాబు జేసీబీలో వెళ్లి పరామర్శించారు. సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చేసరికి జగన్ కు చిప్ దొబ్బింది. వాళ్లు అవినీతి చేస్తే అందరూ అవినీతి చేస్తారనే భ్రమలో ఉన్నారు. మేం ప్రతిక్షణం ప్రజల కోసమే పని చేస్తాం. రంగులు మార్చేందుకు, ఎగ్ పఫ్ లకు కోట్ల రూపాయలు తగలేసే వాళ్లు మా గురించి మాట్లాడ్డం నవ్వు తెప్పిస్తుంది. మీ తాతగారి సొమ్ము ఏమైనాా ఇచ్చారా’’ అని అనిత మండిపడ్డారు.
వచ్చేసారి ఆ 11 సీట్లు కూడా రావు- మంత్రి నారాయణ
తమ ప్రభుత్వం మీద మాజీ సీఎం జగన్, ఆయన ప్రసార మాధ్యమాలు చేస్తున్న దుష్ప్రచారం చేస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నామ రూపాల్లేకుండా పోవడం ఖాయంగా కనిపిస్తుందన్నారు మంత్రి నారాయణ. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా ఆయన తీరు మారలేదన్నారు. వరదలు వచ్చినప్పుడు జగన్ ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఫోటోలకు పోజులిచ్చేందుకు అలా వచ్చి ఇలాపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల కష్టాలను తీర్చారని వెల్లడించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే జగన్ మాదిరి పరదాల మాటున దాచుకోలేదని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు.
Read Also : టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం, ఆ పేర్లు ఉంటాయ్ : మంగళగిరిలో జగన్ కామెంట్స్