Rajini: విడదల రజినీ. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ లీడర్. టీడీపీలో ఉన్నప్పుడు ఎంత పాపులరో.. వైసీపీలోకి వచ్చాక అంతకుమించి. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా గెలిచి.. రెండేళ్లలోనే మంత్రి పదవి కూడా సాధించారంటే మాటలా. సైబరాబాద్లో నాటిన మొక్కను తానంటూ గతంలో చంద్రబాబును తెగ పొగిడేశారు. ఇప్పుడు వైసీపీ నేతగా అంతే సూటిపోటి మాటలతో కుళ్లబొడుస్తున్నారు. జగన్ను సైతం పదే పదే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. లేటెస్ట్గా తన నియోజకవర్గంలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్లో మాట్లాడిన మంత్రి విడదల రజినీ.. తన అద్భుత ప్రసంగంతో మరోసారి ఆకట్టుకున్నారు. సీఎం జగన్ను సైతం తన వాక్చాతుర్యంతో మెప్పించారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే…
తన రాజకీయ జీవితం, పదవులు, రాజకీయ భవిష్యత్తు.. జగన్ పెట్టిన భిక్షేనంటూ భావోద్వేగంతో కంటతడి పెట్టారు మంత్రి రజినీ. సాధారణ బీసీ మహిళ అయిన తనకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చి మంత్రిని కూడా చేశారంటూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత దేశ ఆత్మ గ్రామ సీమల్లోనే ఉందని గాంధీజీ అన్నారు.. పల్లె సీమలే దేశానికి పట్టుకోమలని మన సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.. అందుకే వలంటీర్ వ్యవస్థ తెచ్చారని చెప్పారు. నగరాల్లో ధనవంతులకు మాత్రమే ఉండే ఫ్యామిలీ డాక్టర్.. ఇప్పుడు గ్రామాల్లో ఉండే పేదలకు సైతం ఓ ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నారని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం.. ఇది జగన్ మానసపుత్రిక.. అంటూ మంత్రి రజిని కొనియాడారు.
జగన్ను పొగడడంతో పాటు చంద్రబాబుపైనా విరుచుకుపడ్డారు మంత్రి విడదల రజినీ. దోమలపై దండయాత్ర, ఈగలపై కత్తి యుద్ధమంటూ కాలక్షేపం చేశారని చంద్రబాబుపై సెటైర్లు వేశారు. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు ఏనాడూ ప్రజారోగ్యం గురించి ఆలోచించలేదని, పైగా ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టారని రజిని మండిపడ్డారు.
“నలుగురు ఎమ్మెల్యేలను కొనొచ్చేమో.. నాలుగు టీవీలు, పత్రికలు ఉండొచ్చేమో.. నాలుగు పార్టీలతో పొత్తు ఉండొచ్చేమో.. కానీ, గుర్తు పెట్టుకోండి చంద్రబాబుగారు.. నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికీ ఉండరు. ఆ స్థానం జగనన్నదే” అంటూ పంచ్ డైలాగులు వదిలారు. ఎవరెన్ని పన్నాగాలు పన్నినా.. భూమి చీలినా.. నింగి కుంగినా.. అన్యాయానికి ఓటమి తప్పదని, చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని, జగనన్న గెలుపు తథ్యమని.. మంత్రి రెచ్చిపోయారు.
“వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి.. ఊపిరి కావాలంటే వాయుదేవుడు కావాలి.. పంట పండాలంటే వరుణ దేవుడు కావాలి.. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆనందంగా ఉండాలంటే జగనన్నే కావాలి.. మళ్లీ మళ్లీ జగనన్నే రావాలి”.. ఇలా మైమరిచి మాట్లాడారు మంత్రి విడదల రజినీ. ఆమె ప్రసంగం సభకు హాజరైన ప్రజలతో పాటు సీఎం జగన్నూ తెగ ఆకట్టుకుంది. నవ్వుతూ, రజినీ ప్రసంగాన్ని వింటూ తెగ మురిసిపోయారు జగనన్న.