విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తున్నా ఘటనకు కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి క్లూ కూడా దొరక్కపోవడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లవెతున్నాయి. లోకల్ బాయ్ నాని వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చన్న అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ప్రమాదంలో 40 బోట్లు కాలి బూడిద కావడంతో బాధితులను ఆదుకునే క్రమంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనుంది. ఈ మేరకు రూ.7.11 కోట్ల నిధులను విడుదల చేసింది. బోట్లపై ఆధారపడిన వారికి వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒక్కొక్కరికి 10 వేల చొప్పున 480 మందికి అందజేసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ ఆధారంగా పరిహారం ఇవ్వనున్నారు. 30 బోట్లు పూర్తిగా, 18 బోట్లు పాక్షికంగా కాలినట్టు గుర్తించింది విచారణ కమిటీ. ఈ మేరకు 480 మందికి మంత్రి సిదిరి చేతుల మీదుగా ఇవాళ నష్టపరిహారం చెల్లించనుంది.
జనసేన అధినేత పవన్కల్యాణ్ విశాఖ పర్యటనపై స్పందించారు మంత్రి సీదిరి అప్పలరాజు. బోటు ప్రమాద బాధితులను పరామర్శించి.. వారికి పార్టీ తరపున పరిహారం చెల్లిస్తానని తెలిపారు పవన్. అయితే,.. పవన్ ప్యాకేజీ డబ్బులు మత్స్యకారులకు అవసరం లేదని అన్నారు మంత్రి సిదిరి. ఈ సందర్భంగా సేనానిపై ఫైర్ అయిన ఆయన.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఇస్తే ఒప్పుకుంటాం కానీ.. మత్స్యకారులను తొక్కేసి అవమానించిన చంద్రబాబును సీఎం చేయడానికి తీసుకున్న ప్యాకేజీ సొమ్ము ఇస్తానంటే ఒప్పుకోమని ఆయన మండిపడ్డారు. కాగా.. గురువారం మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించనుంది. మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా 480 మందికి ఈ పరిహారం చెల్లించనుంది.