Christmas in TTD Land: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమాన్ని చేపట్టారు. యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసరు, పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు కూడా చేశారు. అధికారులు ఎవరి ఒత్తిడితో ఈ వేడుకలకు అనుమతి ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎస్వీ యూనివర్సిటీకి లీజు కింద టీటీడీ వందలాది ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు అభివృద్ధి కోసం వార్షిక నిధులను కూడా చాలా ఏళ్లుగా మంజూరు చేస్తోంది. వర్సిటీలో నిర్వహించే పలు సదస్సులకు, పరిశోధనా ప్రాజెక్టులకు కూడా ఆర్థిక వనరులను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీ క్రిస్మస్ వేడుకలకు వేదిక కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జూపార్క్ సమీపంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. కళాశాల ఆవరణ ఏర్పాటు చేసిన క్రీస్తు పాకను సందర్శించారు. క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. హిందువులు పవిత్ర స్థలంగా భావించే తిరుమల, తిరుపతి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యమతానికి చెందిన వేడుకలు నిర్వహించటం నిషేధమని తెలిసినా.. కావాలనే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ప్రపంచప్రఖ్యాతి గాంచిన టీటీడీకి సంబంధించిన స్థలాల్లో.. అన్యమత ప్రచారం చేయటం సరికాదంటూ చెబుతున్నారు.
.
.