Minister Payyavula Keshav Reaction on YSRCP: వైసీపీపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ మరోసారి తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ‘తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేది వాస్తవం. అపచారం జరిగిందన్నది నిజం. వాస్తవాలు కళ్లముందు ఉన్నాయి. కావాలంటే మేమిస్తున్న లడ్డూను మీరు పరీక్షించుకోండి. తప్పులు సరిదిద్దే క్రమంలో నిజాలు వెలుగులోకి వచ్చాయి. ధర్మప్రచారం, ధర్మ పరిరక్షణలో మార్పు మొదలైంది. మీరు చేసిన పాపాలు చాలు. తప్పుల మీద తప్పులు చేసి మళ్లీ మీరు మాపైనే ఎదురుదాడు చేస్తున్నారు.
Also Read: లడ్డూ వివాదంపై వైసీపీ సీరియస్.. రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పిలుపు.. ఏ రోజున అంటే..?
మరోసారి వైసీపీ పొలిటికల్ ఈవెంట్ కు పిలుపునిచ్చింది. భక్తుల మనోభావాలతో ఆడుకోవొద్దు. వైసీపీ పాలనలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. జగన్ కు వెంకటేశ్వరస్వామిపై నమ్మకంలేదు. తిరుమల కొండను బిజినెస్ సెంటర్ లా మార్చారు వైసీపీ నేతలు. జగన్ తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ లో సంతకం చేయాలి’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. వైసీపీ నేతలు పేర్నినాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. కూటమి నేతలు లడ్డూ వివాదాన్ని కావాలనే క్రియేట్ చేస్తున్నారన్నారు. తమ పాలనలో అలాంటిదేమీ జరగలేదన్నారు. దీనిపై విచారణ జరిపించాలంటూ తమ నేత జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. దీనిపై సిట్ తో విచారణ చేయించడం కాదు.. దమ్ముంటే సీబీఐతో విచారణ చేయించాలన్నారు. సెప్టెంబర్ 28న శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పూజలు చేయాలంటూ వైసీపీ పిలుపునిచ్చినట్లు వారు పేర్కొన్న విషయం తెలిసిందే.