Minister Durgesh: అదొక ఇంద్రభవనం. ఎటువైపు చూసినా అద్దాల మేడను తలపించే అపురూప భవనం అది. అక్కడ ఏర్పాటు చేసిన టాయ్ లెట్, స్నానమాచరించే టబ్ కూడా వివాదాస్పదమయ్యాయి. ఇప్పటికే గుర్తుకు వచ్చేసిందిగా ఆ ఇంద్రభవనం.. ఎందుకు జ్ఞప్తికి రాదు.. సోషల్ మీడియాలో కొద్దిరోజులు హవా నడిచిన భవనమే అది. ఇంతకు ఇంతలా ఆ భవనం గురించి చెప్పడం ఎందుకు.. మాకు తెలియదా అనుకుంటున్నారా.. ఔను మీరనుకున్న భవనమే ఇది.. అదే రుషికొండ ప్యాలెస్.
వైసీపీ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రుషికొండలో అతి పెద్ద భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణం సమయం నుండే వివాదాస్పదంగా మారింది. కొన్ని రోజులు ఈ భవనం చుట్టే ఆల్ పార్టీస్ కి విమర్శలు, ప్రతి విమర్శలు సాగాయి. అయితే ఎన్నికలు వచ్చాయి.. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.. కూటమి అధికారంలోకి వచ్చింది.
ఇక అప్పుడే అసలు ఈ ఇంటి బాగోతం తెలుసుకొనేందుకు కూటమి నేతలు ప్రయత్నించారు. భవనం లోపల ఎటు చూసినా కోట్ల రూపాయల విలువ కలిగిన గృహోపకరణాలే. వాటిని చూసి షాక్ తిన్న నేతలు.. మీడియాను కూడా తీసుకెళ్లి.. అసలు ఈ భవనం చూడరయా అంటూ అనుమతించారు. ఇలా ఈ ఇంద్రభవనం వార్తల్లోకెక్కింది.
ఇంతకు ఇప్పుడెందుకు ఈ భవనం గురించి అనుకుంటున్నారా.. ఏమీ లేదండి.. తాజాగా టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ ఓ కామెంట్ చేశారు. ఏమన్నారంటే అసలు ఆ ప్యాలెస్ ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదంటూ.. రుషికొండ ఇంద్రభవనంపై స్పందించారు. విశాఖపట్నం రుషికొండ లో ‘ది హైవ్’ హోటల్ ప్రారంభోత్సవంలో భీమిలి నియోజకవర్గం శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావుతో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు.
Also Read: AP politics: షర్మిళ వదిలిన బాణం ఎఫెక్ట్.. టీడీపీకి తగులుతోందా.. ఆ లెటర్ అంతరార్థం అదేనా..
అలాగే విశాఖపట్నం ఆధునీకరణ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన పున్నమి యాత్రినివాస్ ని పరిశీలించి నాణ్యత, సమయం, సంబంధించిన వివరాలు తెలుసుకుని అధికారులకు తగు సూచనలు జారీచేశారు.
ఇక్కడ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. రుషికొండ నిర్మాణాలు చాలా పెద్దవి.. కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో కట్టినవి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు. అంతటితో ఆగక.. అవినీతి సామ్రాజ్యానికి మ్యూజియం ఏర్పాటుకు సరైన ప్రదేశంగా మంత్రి అభివర్ణించారు.
అలాగే వైసీపీ తన పాలన సమయంలో ప్రజాభక్షక పాలన సాగించిందని, పర్యాటకం అభివృద్ది వైపు ఒక్క అడుగు వేయలేదన్నారు. అమరావతిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని, త్వరలోనే రెండు ఫైవ్ స్టార్ హోటళ్ల నిర్మాణం జరగనుందన్నారు. జనవరిలో విశాఖ, కాకినాడ, బాపట్ల బీచ్ ళ వద్ద ఘనంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని, రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.