Dharmana Prasada Rao Latest news(AP news today telugu): ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతల మీదే ఆయన గొంతు పెంచటం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. నేడు మీడియాతో మాట్లాడిన ధర్మాన చేసిన వ్యాఖ్యలపై అటు వైసీపీ అధిష్ఠానం ఆరా తీస్తోంది.
ప్రజాస్వామ్యంలో జనం ప్రతినిధులుగా గెలిచిన వారు పారదర్శకంగా, చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి ధర్మాన ప్రసాద రావు మీడియా సమావేశంలో చెప్పారు. అవినీతికి దూరంగా, బాధ్యతాయుతంగా ఉన్న తనను వైసీపీ అధిష్ఠానం పక్కనబెట్టటం మీద ఆయన అసంతృప్తిని వ్యక్తం చేయటమే గాక.. పార్టీ సీనియర్ నేత.. వైవీ సుబ్బారెడ్డి మీద మండి పడ్డారు.
మూడున్నర దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉందని, ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను శ్రీకాకుళం జిల్లాకు ఎంతో మేలు చేశానని వివరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తనకు తాను చేసిన అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. ‘కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి మా జిల్లాలోని భూములను దొబ్బేస్తామన్నాడు. నువ్వు ఎవడివి.. శ్రీకాకుళం నీ అబ్బసొమ్ముకాదు.. వచ్చిన వాడు ఏ పార్టీ అనేది చూడను. ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తానంటే నడవదు. వాటిని ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోను. శ్రీకాకుళంలోని సహజ వనరులు కొట్టేసేందుకే ఎక్కడెక్కడి వాళ్లో వస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే.. ఇదంతా రౌడీల చేతిలోకి వెళిపోతుంది. మిగతా ప్రాంతాలు ఇలానే పాడైపోయాయి.శ్రీకాకుళం ప్రశాంతమైన ప్రాంతం. దీన్ని ఇలాగే ఉంచుతాం’అని పరోక్షంగా సుబ్బారెడ్డి మీద మండిపడ్డారు.
జిల్లాకు ఇంత అభివృద్ధి చేసినా మేం మీ దృష్టిలో లేకపోతే.. మీ ఇష్టం. నేను గెలిస్తే మంచిది. ఓడినా మీ స్నేహితుడిగా ఉంటా’ అని వ్యాఖ్యానించారు. నిజానికి ధర్మాన తన కుమారుడికి టికెట్ కోరాడనీ, దానికి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకోలేదనే వార్తలు గతంలో వచ్చాయి. అటు సీఎం సైతం ధర్మాన కుమారుడికి బదులు ఈసారికి ధర్మాన ప్రసాదరావునే పోటీచేయాలని కోరినట్లు సమాచారం. అయితే.. కొన్ని చోట్ల వారసులకు అవకాశం ఇచ్చిన సీఎం.. సీనియర్నైన తన కోరికను మన్నించకపోవటంతో ధర్మాన అసంతృప్తికిలోనైనట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైవీ సుబ్బారెడ్డి భూకబ్జాలను, అవినీతి వ్వవహారాల మీద గొంతుపెంచి మాట్లాడుతున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు.