Minister Atchannaidu Comments: ఏపీలో టిడిపి కూటమి విజయాన్ని అందుకొని పరిపాలనపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించింది. అయితే ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైన వైసీపీ… ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాక్ కు గురైందని చెప్పవచ్చు. వైసీపీ క్యాడర్ మాత్రం ఈ ఘోర ఓటమిని జీర్ణించుకోలేక స్తబ్దతగా ఉన్న పరిస్థితి. ఈ తరుణంలో వైసీపీ నేతలు.. టిడిపిలో చేరేందుకు విశ్వప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పవచ్చు. ఈ వాదనకు బలోపేతం చేసేలా తాజాగా టిడిపికి చెందిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు, మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.
టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి భారీ విజయాన్ని అందుకోగా.. వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కూటమి పార్టీలో చేరారనే చెప్పవచ్చు. అందులో భాగంగా నగర పాలక సంస్థలపై దృష్టి సారించిన టిడిపి వాటిని చేజిక్కించుకొనేందుకు ముందడుగు వేసింది. అందులో భాగంగానే ఒంగోలు నగర పాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత, వైసీపీ కార్పొరేటర్ల తో కలిసి టిడిపిలో చేరారు. ఇలా ప్రభుత్వం ఏర్పడ్డాక టిడిపిలో చేరికలు మొదలైంది ఇక్కడి నుండే అని చెప్పవచ్చు. ఇక ఆ సమయం నుండి ఛోటా మోటా వైసిపి నేతలు అధిక సంఖ్యలో టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపారనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన వైసీపీ అధిష్టానం సైతం వలసల నివారణకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. అలాగే ఊహించని రీతిలో జనసేనలోకి మాజీ సిఎం జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగప్రవేశం చేశారు.
ఇలా కూటమి పార్టీలలో చేరేందుకు వైసీపీ ఛోటా నాయకులే కాదు.. బడా నాయకులు కూడా ప్రయత్నించి భంగపడ్డారట. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన ఒక్కమాట.. వైసీపీకి చెందిన బడా నేతకు ముప్పుతిప్పలు పెట్టిందని చెప్పవచ్చు. టిడిపిలో చేరేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేశారని, అంతటితో ఆగక కాళ్ళు పట్టుకున్నారని రాజకీయంగా బాంబ్ పేల్చారు అచ్చెన్నాయుడు. పెద్దస్థాయిలో పార్టీలో చేరేందుకు పైరవీలు సాగించారని, విజయసాయి రెడ్డి.. మీకో దండం.. మీ రాకకో దండం అంటూ తలుపులు మూసేసినట్లు అచ్చెన్న తెలిపారు. ఇలా ఈ వ్యాఖ్యలు వాస్తవమైతే ఇక వైసీపీకి చెందిన బడాబాబులు అందరూ.. ఈరోజు కాకున్నా.. రేపైనా టిడిపిలో చేరడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని టిడిపి నాయకులు ఇటీవల బాహాటంగానే తెలుపుతున్నారు.
Also Read: Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు, ఆసుపత్రికి తరలింపు
ఇలా అచ్చెన్న వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి సైతం స్పందించారు. నేను టిడిపిలో చేరడమా.. ఈ జన్మకి అలా చేయను.. భ్రమల్లో వద్దయ్యా అచ్చెన్న అంటూ ట్వీట్ చేశారు. ఏదిఏమైనా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే అన్న మాజీ మంత్రి బాలినేని బాటలో త్వరలోనే ఎందరో వైసీపీ నేతలు టిడిపి లేదా జనసేన పార్టీలలో చేరడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అదే నిజమైతే ఇప్పటికే నిండా మునిగిన వైసీపీకి మున్ముందు టిడిపి కూడమీ చుక్కలు చూపించడం ఖాయం అని కూడా అంచనా వేయవచ్చు.