ఏపీకి మిచౌంగ్ తుపాను హెచ్చరికలు జారీ అయ్యాయి. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిచౌంగ్ తుపాను..నేడు దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు – మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లా దివిసీమ దగ్గరలో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక గంటకు 95-105 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. మిచౌంగ్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకొస్తోంది. ప్రస్తుతం చెన్నైకి 130 కి.మీ, నెల్లూరు 220 కి.మీ, బాపట్లకు 330 కి.మీ, మచిలీపట్నానికి 350 కి.మీ దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది.
తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాలో వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంటచేతికొచ్చే సమయంలో తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. రైతన్న ఆందోళన చెందుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. బాపట్ల సహా.. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తుపాను నేపథ్యంలో ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేశారు.
విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు జిల్లాల్లో అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో రెండురోజులపాటు స్కూళ్లకు సెలవులిచ్చారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు.