Michaung Cyclone : మిగ్ జాం తుపాను తీరానికి దూసుకొస్తోంది. మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తుపాను బాపట్ల సమీపంలో తీరాన్ని దాటుతుందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగానే కదులుతోంది. తీవ్ర తుపానులో కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీవ్ర తుపానులో మరికొంత భాగం భూమిపై ఉందని పేర్కొంది. తీరానికి అత్యంత దగ్గరగా తీవ్ర తుపాను కదులుతోందని ప్రకటించింది. తుపాను కేంద్రకంలోని మేఘాలు భూభాగంపై ఉన్నాయని తెలిపింది.
గత 6 గంటలుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా తీవ్ర తుపాను పయనిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మిగ్జాం తుపానుతో పంటలు దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతింది.
తుపాను కారణంగా విశాఖ ఎయిర్ పోర్టు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. 23 సర్వీసులను ఇండిగో నిలిపివేసింది. కానీ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్లో ఉంచుతున్నామని ఎయిర్పోర్టు డైరెక్టర్ తెలిపారు. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుందన్నారు. రన్వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 గంటల వరకే విమానాశ్రయంలో రాకపోకలు అనుమతి ఇస్తున్నామని ఎయిర్పోర్టు డైరెక్టర్ వెల్లడించారు.
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్లో భారీ ఈదురుగాలుల ధాటికి పరంజ కూలింది. బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసం కట్టిన పరంజ పడిపోయింది. ఐదంతస్తుల పైనుంచి ఇనుపరాడ్లు జారిపడ్డాయి. దీంతో ఒక గృహం పూర్తిగా
5 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నారు. ఆ సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.