మిగ్జాం తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. క్రమంగా తుపాను, వాయుగుండగా బలహీనపడి.. అల్పపీడనంగా మారింది. ఈశాన్య తెలంగాణ, దాన్ని అనుకుని ఉన్న ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏలూరు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నాయి. వీటి ప్రభావంతో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో కోస్తా జలమయమైంది. బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లో వాగులు పొంగాయి. పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పల్నాడు జిల్లాలో వరద పెరగడంతో పలుచోట్ల రాకపోకలు స్తంభించాయి. ఉత్తరాంధ్రలో వరద ధాటికి చాలాచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. తెలంగాణ నుంచి వచ్చిన వరదతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో వాగులు పరవళ్లు తొక్కాయి. గంపలగూడెం- విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచాయి. ఎడతెరిపి లేని వర్షంతో రాజమహేంద్రవరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కాలనీల్లోకి నీరు చేరింది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో గోస్తనీ నది ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. శారదా నది ఉద్ధృతికి అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎలమంచిలి- గాజువాక బైపాస్ రహదారిలో నారాయణపురం వద్ద ప్రవాహం పెరిగింది. సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం దగ్గర పెద్దగడ్డ వంతెన కొట్టుకుపోయింది. అనంతగిరి మండలంలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్ ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. కోటవురట్లలో వరదనీరు ప్రధాన రహదారిపైౖకి చేరి వాగును తలపించింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు నదులు, గెడ్డలు, వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వందల ఇళ్లు జలదిగ్బంధమయ్యాయి. పాలకొల్లు, భీమవరం, ఏలూరు, నూజివీడు తదితర పట్టణాల్లోని ఇళ్లల్లోకి కూడా నీరు చేరింది. వాగుల ఉద్ధృతితో ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ గోడ కూలిపోయింది.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం సీతపాడులో ఉప్పొంగి ప్రవహిస్తున్న లవ్వగెడ్డను దాటేందుకు ప్రయత్నించి ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో సొసైటీ ఎదుటి రోడ్డులోని గోతిలో పడి గుర్తు తెలియని వ్యక్తి, నూజివీడు మండలం పాత అన్నవరంలో మురుగు కాల్వలో పడి వృద్ధుడు, జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఊరచెరువులో పడి ఒక యువకుడు మృతి చెందారు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం దగ్గర జల్లేరు వాగులో మరో యువకుడు గల్లంతయ్యాడు.