Mekapati : నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ వివాదం మరింత రాజుకుంది. తనను కుమారుడిగా అంగీకరించాలంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. తన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి అని డీఎన్ఏ పరీక్షకు సిద్ధమని శివచరణ్ రెడ్డి సవాల్ కూడా చేశాడు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో తల్లి,తను కలిసి దిగిన ఫోటోలు బయటపెట్టాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మేకపాటి స్పందించారు. తనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, కొడుకులు లేరని తేల్చిచెప్పారు. ఈ సమయంలో ఆయనకు రెండో భార్య ఉందనే విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు ఆ యువకుడు తల్లి తెరపైకి వచ్చారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తనకు పదిహేనేళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఆయనకు ఇష్టం లేకపోవడంతో రెండేళ్లకే వదిలేసి వెళ్లిపోయారని.. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని, ఇంటికి తీసుకెళతానని చంద్రశేఖర్ రెడ్డి నమ్మించారని చెప్పుకొచ్చారు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోపోతే రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగారన్నారు. ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె ఇంకా ఏమన్నారంటే..
నన్ను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టారు. 18 ఏళ్లపాటు మాతోనే ఉన్నారు. కుమారుడు శివచరణ్రెడ్డిని బాగా చూసుకునేవారు. ప్రస్తుతం చంద్రశేఖర్రెడ్డితో ఉన్న శాంతకుమారి పరిచయమైన తర్వాత మా ఇంటికి రావడం తగ్గించారు. ఆ విషయంపై నిలదీయడంతో పూర్తిగా రావడం మానేశారు. అప్పటి నుంచి మేం కష్టాలు పడుతున్నాం. నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చి బజారుపాలు చేసినా ఒక్కమాట అడిగానా? మీ అంతట మీరే వచ్చారు. మీరే వెళ్లారు. మీ మాటలతో అవమానం భరించలేకే ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. డబ్బు కోసం వచ్చామని మాట్లాడతారా? రండి చూద్దాం ఎవరి దగ్గర ఎంత డబ్బుందో? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని లక్ష్మీదేవి గట్టిగా నిలదీశారు.
2019 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి చంద్రశేఖర్రెడ్డి తరఫున శాంతమ్మ అనే మహిళ ప్రజల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ కార్యకలాపాలను ఆమే చూసుకొంటున్నారు. ఇదే విషయంలో ఆయన మొదటి భార్య తులసమ్మ, కుమార్తె రచనారెడ్డి, మేకపాటి కుటుంబ సభ్యులు.. చంద్రశేఖర్రెడ్డితో విభేదించి దూరంగా ఉన్నారని ప్రచారం ఉంది. 29 ఏళ్లుగా శాంతమ్మకు తనకు మధ్య బంధం ఉందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనకు శాంతమ్మకు కలిగిన సంతానం సాయిప్రేమికారెడ్డి అని వెల్లడించారు. తనకు ఇద్దరు అమ్మాయిలేనని మగ సంతానం లేదని మరోసారి స్పష్టంచేశారు. అయితే వారుసుడు వివాదంపై మేకపాటి కుటుంబం ఇంకా స్పందించలేదు. తల్లి, కొడుకులు లక్ష్మీదేవి, శివచరణ్ రెడ్డి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాదంలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయనే ఆసక్తి నెలకొంది.