C. Ramachandraiah : ఆ జిల్లాలో సీనియర్ నేత ఆయన. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవిలు అనుభవించిన అనుభవం ఉన్న ఆ నేత రాజ్యసభకు కూడా వెళ్లి వచ్చారు. ఆ క్రమంలో కండువాలు మార్చేస్తూ అన్ని పార్టీలు తిరిగేశారు. ఇక ఇప్పుడు ఎక్కడ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారో తిరిగి అదే గూటికి చేరుకున్నారు. సొంత ప్రయోజనాల కోసం. పదవుల కోసం ఏ పార్టీలో చేరడానికైనా వెనకాడరన్న పేరుంది సదరు నేతాశ్రీకి. ఇంతకీ ఎవరా నేత అంటారా?
సి.రామచంద్రయ్య ఉమ్మడి కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. ఎన్టీఆర్ నుంచి జగన్ వరకు అందరినీ చూసిన పాత తరం పొలిటికల్ లీడర్. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయిలో పదువులు అనుభవించిన చరిత్ర ఆయనది. అన్నీ ప్రజల కోసమే అంటారు కానీ ఎక్కడా ప్రజల్లో కనిపించరు. టీవీల్లో మాత్రం అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో తనదైన ముద్ర వేసుకోవడానికి ప్రయత్నించే తెలివైన పొలిటీషియన్. ఆ క్రమంలో మొన్నమొన్నటి దాకా వైసిపి ఉండి చంద్రబాబు పై ఒంటి కాలుపై లేచి విమర్శించిన రామచంద్రయ్య . తాజాగా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరడంపై తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ఆయన ఎమ్మెల్సీ గా ఉంటూ ప్లేట్ పిరాయించడం వెనుక కారణం ఏంటా అని అంతా విస్తుపోతున్నారు.
సి రామచంద్రయ్య పాతతరం పొలిటీషియన్ అయినా మారుతున్న పొలిటికల్ ట్రెండ్కి అనుగుణంగా రంగులు మార్చేస్తారని అంటుంటారు ఆయన సన్నిహితులు . 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కడప సెగ్మెంట్ నుంచి టిడిపి తరపున గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూనే ఉన్నారు . ఎన్టీఆర్ మంత్రి వర్గంలో 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమ మంత్రిగా పనిచేశారు. తర్వాత రెండు సార్లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుదీర్ఘ కాలం పాటు టిడిపీ లో కొనసాగుతూ అనేక కీలక పదవుల్లో కొనసాగిన రామచంద్రయ్య ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ లో చేరారు.
పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కాగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రి పదవి కూడా దక్కించుకోగలిగారు. 2018లో వైసిపి లో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీగా ఇంకా పదలీకాలం ఉన్నా సడెన్ టిడిపి లో చేరడం వెనుక చాలా లెక్కలే వేసుకున్నారంట అయన. కుమారుడి భవిష్యత్తు కోసం టిడిపి లో చేరినట్లు తెలుస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటం తన కొడుక్కి కలిసి వస్తుందన్న అంచనాతో. అక్కడి ఎమ్మెల్యే టికెట్ కోసం ఒప్పందం చేసుకునే ఆయన తిరిగి సైకిల్ ఎక్కారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజంపేటలో అరడజను మంది టిడిపి నేతలు టికెట్ రేసులో కనిపిస్తున్న తరుణంలో. రామచంద్రయ్య ఎంట్రీ ఎలాంటి ప్రభావం చూపుతుందో? ఆయన ఆశలు ఎంతవరకు నెరవేరతామో చూడాలి.