Vontimitta: ఒంటిమిట్టలో కోదండ రాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం శివ ధనుర్భంగా లంకారంలో పురవీధుల్లో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఊరేగారు. స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా స్వామి, అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. భక్త జన బృందాలు, చెక్క భజనలు, కోలాటాలు, కేరళ వాయిద్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి రోజు సీతారామ కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. కానీ ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు రాములోరి కల్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాముల వారి కల్యాణానికి ఏపీ ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
పౌర్ణమి రోజు కల్యాణోత్సవం..
పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుడికి శ్రీరాముడు మాటిచ్చాడట. అందుకే తన కళ్యాణ వేడుకను చంద్రుడు తిలకించేలా చైత్ర పౌర్ణమి రోజు రాత్రి జరుగుతుందని వరమిచ్చాడని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా… రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు.
ఒంటిమిట్ట విశేషాలు..
జాంబవంతుడు ఇక్కడ కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడని పురానగాథ. శ్రీరామచంద్రుడిపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.