Cyclone: తుపాను.. తీవ్ర తుపానుగా మారింది. మాండౌస్ ముంచెత్తుతోంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వాన వెంటాడుతోంది.
తీవ్ర తుపానుగా ఉన్న మాండౌస్ క్రమంగా బలహీనపడి పుదుచ్చేరి-శ్రీహరి కోట మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 65 నుంచి 85 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా, వాయుగుండంగా, అల్పపీడనంగా మారే అవకాశముంది.
మాండౌస్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోనూ ఎడతెరిపిలేని వర్షంతో భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోనూ వాన ఉధృతి బాగా ఉంది. తుపాను తీవ్రత, సహాయక చర్యలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఆదేశించారు.
మరోవైపు, ఏపీకంటే తమిళనాడులో మాండౌస్ ప్రభావం అధికంగా ఉంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా చెన్నై నుంచి వెళ్లాల్సిన 16 విమానాలను రద్దు చేశారు. తమిళనాడులోని చెంగలపట్టు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. గ్రేటర్ చెన్నై పరిధిలో అన్ని పార్కులు, ప్లే గ్రౌండ్స్ ను మూసివేశారు. చెన్నైలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు.
శుక్రవారం అర్ధరాత్రి కానీ, శనివారం తెల్లవారుజామున కానీ, మామల్లాపురం సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. మామల్లపురంలో మాండౌస్ తీరం దాటే సమయంలో 89 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం-imd వెల్లడించింది.