Tirupati : పండగైనా , పెళ్ళైనా, పుట్టిన రోజైనా , పార్టీ అయినా.. ఏదైనా స్పెషల్ డే అయితే చాలు కేక్ కంటే ముందు బిర్యానీనే కావాలంటారు. అది లేనిదే పార్టీ ఉండదు. పార్టీ అంటే బిర్యాని.. బిర్యాని అంటే పార్టీ.. అదీ ఇప్పుడు బిర్యానీకి ఉన్న క్రేజ్. ప్రతి ఒక్కరూ నోటి రుచి కోసం బిర్యానీని కోరుకుంటున్నారు. గతేడాదిలో బిర్యానీల కోసం చాలా ఖర్చు చేసి ఉంటారు కదా. మరి బిర్యానీ మీకెప్పుడైనా లాభం తెచ్చిపెట్టిందా ? ఒక వ్యక్తికి బిర్యానీనే వరంలా మారింది. ఒకటి కాదు రెండు కాదు.. అక్షరాలా రూ.7 లక్షల విలువైన కారును తన ఇంటికి తీసుకొచ్చింది. ఇంతకీ అదెలా జరిగిందో తెలుసుకుందాం.
తిరుపతిలో ఓ హోటల్ యజమాని కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని లక్కీ డ్రా నిర్వహించాడు. 2023 సెప్టెంబర్ లో తమ హోటల్ లో బిర్యానీ తిన్న ప్రతి ఒక్కరికి కూపన్ ఇచ్చారు. 23 వేల మంది కస్టమర్లకు పైగా కూపన్లు అందించారు. ఆ కూపన్లకు సంబంధించిన లక్కీ డ్రా డిసెంబర్ 31న నిర్వహించారు. రోబో హోటల్ అధినేత భరత్ కుమార్ రెడ్డి, తన భార్య నీలిమ డిసెంబర్ 31న లక్కీ డ్రా తీశారు. అందులో తిరుపతికి చెందిన రాహుల్ అనే వ్యక్తి విజేతగా నిలిచి.. రూ. 7 లక్షల విలువైన నిస్సాన్ మాగ్నైట్ కారును బహుమతిగా గెలుచుకున్నాడు. బిర్యానీ లక్కీ డ్రా లో ఇంత విలువైన కారు దక్కడంతో రాహుల్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.