Latest News in Andhra Pradesh : విజయవాడలో అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్న తర్వాత మహాయజ్ఞం ప్రారంభమైంది. గోశాల వద్ద సీఎం ప్రత్యేక పూజలు చేశారు. కపిల గోవుకు హారతి ఇచ్చారు. ఆ తర్వాత అఖండ దీపారాధనలో పాల్గొన్నారు.
ఈ నెల 17 వరకు ఈ మహాయజ్ఞం కొనసాగుతుంది. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన 4 ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క యాగశాలలో 27 కుండాల చొప్పున మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. శనివారం నుంచి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం నిర్వహిస్తారు. పవిత్ర సప్తనదీ, త్రి సముద్ర జలాలతో 1008 కలశాలతో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు.
యజ్ఞ కార్యక్రమాలను భక్తులు వీక్షించేలా యాగశాలల చుట్టూ 4 క్యూలైన్లను ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీల కోసం ఒక క్యూలైన్ ను కేటాయించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాల పంపిణీ చేస్తారు. తొలిరోజు విజయవాడ దుర్గ గుడి ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగలి అందిస్తారు.
యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, ఈనెల 13న ద్వారకా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి, ఈనెల 14న అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి, ఈనెల 15న శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి, ఈ నెల 16న శ్రీవరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి. చివరి రోజు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర అన్వయంతో మహా పూర్ణాహుతితో యజ్ఞ కార్యక్రమాలు ముగుస్తాయి. చివరి రోజు కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
సనాతన ధర్మ పరిరక్షణతోపాటు రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు నిర్వహిస్తోంది.