Chandrababu meets Maharashtra CM Eknath Shinde: ముంబై పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో సమావేశమయ్యారు. అంతకంటే ముందుగా తన అధికారిక నివాసమైన వర్షకు విచ్చేసిన చంద్రుబాబుకు షిండే సాదర స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పలు రంగాల్లో పరస్పర సహకారం, మౌలికవసతుల అభివృద్ధి, పలు ఆర్థిక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇద్దరు సీఎంల మధ్య దాదాపు అరగంట పాటు చర్చలు కొనసాగినట్లు సమాచారం. ఈ సమావేశానికి సంబంధించి ఫొటోలను సీఎం ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియాలో(ఎక్స్)లో పోస్ట్ చేశారు. భేటీకి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
ఇరు రాష్ట్రాల పరస్పర సహకారం ద్వారా అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనే అంశాలపై ప్రధానంగా తమ మధ్య చర్చ జరిగిందంటూ షిండే పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మహారాష్ట్ర పీడీబ్ల్యూడీ మంత్రి దాదా భుసే, షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల్లో మౌళిక సదుపాయల అభివృద్ధి, డిజిటల్ రంగంలో అవకాశాల విస్తరణ తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే, టీడీపీ, శివసేన(షిండే) పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న విషయం తెలిసిందే.
Also Read: మానవత్వం చాటుకున్న మంత్రి.. రోడ్డుపై వెళ్తుండగా..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందిస్తామని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) నిర్వాహకులు మాచో ఫెర్రర్ తెలిపారు. ఆదివారం ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ను అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఫెర్రర్ ను మంత్రి శాలువాతో సత్కరించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమంటూ మంత్రి ప్రశంసించారు.
1969లో ప్రారంభించిన ఆర్డీటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ఏపీ, తెలంగాణలో 3 వేల గ్రామాల్లో సేవలు అందిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. రూ. వేల కోట్లు ఖర్చు చేసి గ్రామాల్లో ఆసుపత్రులు, ఇళ్ల నిర్మాణం, పేదలకు వైద్యం, విద్య, ఆర్థిక సాయం, చెక్ డ్యామ్ లు, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారంటూ లోకేశ్ కొనియాడారు.
Also Read: Shanthi’s husband Madhan Press meet: శాంతికి పుట్టిన మగబిడ్డ ఎవరికి పుట్టాడో తేల్చాలి: భర్త మదన్
యువగళం పాదయాత్రలో ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ట్రస్ట్ సేవలను మరింతగా విస్తరించేలా కలిసి పనిచేద్దామని నిర్వాహకులకు చెప్పారు. ఉపాధి కల్పన, స్వయం ఉపాధి, మహిళా సాధికారత, యువతకు స్కిల్ డెవలప్ మెంట్, ఫారిన్ లాంగ్వేజెస్ నేర్పించడం ద్వారా ఇతర దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వంటి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ఆర్డీటీ సహకారం అందించాలన్నారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన ఆర్డీటీ నిర్వాహకులు ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి కలిసి గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తామని చెప్పారు.