Magunta Srinivasulu Reddy | ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు.
Magunta Srinivasulu Reddy | ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈ సారి టికెట్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు. దాంతో ఇప్పుడు ఆ లోక్సభ నియోజకవర్గం వైసీపీ రాజకీయమంతా మాగుంట చుట్టూనే తిరుగుతోంది. ఆయనకే మళ్లీ ఎంపీగా పోటీ చేసే అవకాశమివ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టుపడుతున్నారు. మాగుంటకు టికెట్ ఇస్తేనే తాను కూడా పోటీలో ఉంటానంటున్నారు బాలినేని. మరోవైపు తన సెగ్మెంట్కు నిధులు విడుదల రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన.. హైదరాబాద్ వెళ్లిపోయారు. దాంతో జిల్లా వైసీపీలో పెద్ద గందరగోళమే కనిపిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఇన్చార్జ్ల మార్పు నిర్ణయాలు ఆసక్తి కరంగా తయారవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విడతల వారీగా ఇన్చార్జ్లను మార్చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులుకు సీటు లేదనే సంకేతాలు ఇచ్చారు. ఫలితంగా ఇప్పుడు మాగుంట టీడీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నారు. ఆ క్రమంలో ఆయన ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.
బాలినేనికి ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేస్తున్నట్లు పార్టీ సమన్వయకర్త విజయసాయి సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. అయినప్పటికీ తాజాగా జిల్లాలో ఎన్నికల సమాయత్తంలో భాగంగా సాయిరెడ్డి నిర్వహించిన సమావేశాలకు బాలినేని దూరంగా ఉన్నారు. బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని.. ఏ మాత్రం తగ్గదని విజయసాయి సాయిరెడ్డి చెప్పుకొస్తున్నా.. బాలినేని మాత్రం పట్టు వీడటం లేదు. ఇదే సమయంలో ఒంగోలు ఎంపీ అభ్యర్దిగా వైసీపీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు ఒంగోలు ఎంపీ వైసీపీ టికెట్ రేసులో కనిపించాయి. అయితే అనూహ్యంగా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అక్కడ లోక్సభ అభ్యర్థిగా రంగంలో దింపాలని ప్రతిపాదించారు జగన్. దానికి చెవిరెడ్డి కూడా ఓకే అన్నారు. తాజాగా చెవిరెడ్డి మాజీ మంత్రి బాలినేని మద్దతు కోరడానికి హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఆయనను కలిసి.. తాను ఒంగోలు లోక్సభకు పోటీ చేద్దామనుకుంటున్నానని.. ఇద్దరం కలిసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులుగా బరిలోకి దిగుదామని చెప్పారు. అయితే దానికి బాలినేని అంగీకరించలేదంట.
ఒంగోలు ఎంపీ టికెట్ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇస్తేనే తాను మద్దతిస్తానని బాలినేని స్పష్టం చేశారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచినప్పుడు బాలినేని ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తన ఓటమికి కారణం వైవీనే అని అప్పట్లో బాలినేని ఆరోపించారు. వరుసకు బావబావమరుదులైన ఆ ఇద్దరు జగన్కి కూడా దగ్గరి బంధువులే. అయినా 2014 ఎన్నికల తర్వాత నుంచి ఆ ఇద్దరి మధ్య ప్రకాశం జిల్లాలో వార్ మొదలైంది. మళ్ళీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారంతో బాలినేని జాగ్రత్త పడుతున్నారంట.. మాగుంట అయితేనే తన విజయం సులువువవుతుందన్నది బాలినేని అభిప్రాయంగా కనిపిస్తోంది.
అదలా ఉంటే మాగుంటకు జగన్ ఈసారి సీటు నిరాకరించడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు. మాగుంట లిక్కర్ వ్యాపారంలో.. జగన్ వాటా అడిగారని కొందరు ప్రచారం చేస్తున్నారు. అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తాను చెప్పినట్లు వినలేదని మాగుంటపై జగన్ అగ్రహంగా ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని మాత్రమే మాగుంట ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీచేయాలని అడుగుతున్నారు. మిగతా నియోజకవర్గ ఇన్చార్జ్లు దానిపై నోరెత్తడం లేదు.
బాలినేని మాత్రం మాగుంట ఎంపీగా పోటీ చేస్తేనే తాను ఒంగోలు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతానని ఇప్పటికే సీఎంకు, ప్రాంతీయ సమన్వయకర్తలకు తేల్చిచెప్పారట. మరోవైపు మాగుంటకు టీడీపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ నుంచి ఆయన తనయుడు రాఘవరెడ్డికి టికెట్ ఇస్తామని టీడీపీ పెద్దలు చెపుతున్నారంట. ఇప్పటికే ఆ దిశగా మాగుంటతో టీడీపీ పెద్దలు టచ్లోకి వెళ్లారని ప్రచారం. ఏదేమైనా జిల్లాలో మాగుంట వ్యవహారంపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.