Madanapalle files burn case: మదనపల్లె ఫైల్స్ దహనం కేసు వైసీపీ నేతల మెడకు ఉచ్చు బిగిసు కున్నట్లేనా? పెద్దిరెడ్డి అనుచరుల నుంచి కీలకపత్రాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారా? రేపోమాపో ఇతరులను నోటీసులు ఇచ్చే పనిలో పోలీసులు పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసులో తీగలాగితే డొంక అంతా కదులుతోంది. సబ్కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం గుట్టును మీటర్ రీడింగ్ ఇన్స్ట్రుమెంట్-ఎంఆర్ఐ డేటా బయటపెట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విద్యుత్ లోడ్లో హెచ్చు తగ్గుల్లేవని తేల్చేసింది. విద్యుత్ లోడ్కు సంబంధించి డేటాను విశ్లేషించిన అధికారులు, షార్ట్ సర్క్యూట్కు ఎలాంటి ఛాన్స్ లేదని తేల్చారు.
విద్యుత్ వైర్లు ఎక్కడా డ్యామేజ్ కాలేదంటూ ఎలక్ట్రికల్ సేఫ్టీ విభాగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పోలీ సులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జూలై 21 రాత్రి పదకొండున్నరకు అగ్నిప్రమాదం జరిగినట్టు ప్రస్తా వించారు. ఘటన జరిగినప్పుడు రాత్రి 12.40 నుంచి 1.30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఎంఆర్ఐ డేటాలో విద్యుత్ లోడ్ జీరోగా నమోదైంది. అగ్నిప్రమాదం కారణంగా కంప్యూటర్ సెక్షన్లోని వైరింగ్ ఔట్ లెట్స్ స్విచ్ బోర్డులు దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత విద్యుత్ వైర్లకు సరఫరా నిలిచిపోయిందని తేలింది.
ఘటన జరిగిన రోజు ఫోన్ కాల్డేటాను విశ్లేషించే పనిలో పోలీసులు పడ్డారు. సబ్కలెక్టర్ ఆఫీసులోని కొంద రు ఉద్యోగుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం దానికి సంబంధించిన డేటాను విశ్లేషిస్తున్నారు. ఇదిలావుండగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అత్యంత సన్నిహితుడు, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శశికాంత్ ఇంటికి పోలీసులు వెళ్లారు. కీలకమైన సమాచారాన్ని అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
ALSO READ: ‘ఏపీ’ అంటే కొత్త అర్థం చెప్పిన కేంద్రమంత్రి పెమ్మసాని
దాదాపు ఎనిమిదిగంటలపాటు జరిపిన సోదాల్లో నాలుగు ట్రంకు పెట్టెల్లో ఫైళ్లను అమరావతికి తరలించారు అధికారులు. అటు తిరుపతిలోని పెద్దిరెడ్డి పీఏ తుకారాం ఇంట్లో సీఐడీ సోదాలు చేసింది. కీలక డాక్యు మెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మదనపల్లె వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పత్రాల గుట్టు విప్పేపనిలో పడ్డారు అధికారులు. ఈ లెక్కన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఉచ్చు బిగిస్తున్నట్లే కనిపిస్తోంది.