Vijayawada : విజయవాడ నగరంలో మద్యం ఏరులైపారుతోంది. ఇక్కడ ఉదయం పాల ప్యాకెట్ దొరుకుతుందో లేదో కానీ.. మందు మాత్రం ఎనీ టైమ్ అందుబాటులో ఉంటుంది. అజిత్సింగ్నగర్, వాంబే కాలనీల్లో జనావాసాల మధ్య విచ్చలవిడిగా బెల్ట్షాపులు వెలిశాయి. వీటి వైపు మాత్రం పోలీసులు కన్నెత్తి కూడా చూడటంలేదని విమర్శలు ఉన్నాయి. దీంతో లిక్కర్ వ్యాపారం యథేచ్ఛంగా సాగుతోంది.
వాంబే కాలనీలోని ఓ బెల్ట్షాపు నిర్వాహకుడు దుర్గాప్రసాద్.. తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి విక్రయిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. రాత్రి, పగలు అని తేడా లేకుండా అమ్మకాలు సాగిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే అతనిపై 35కిపైగా అక్రమ మద్యం కేసులున్నాయి. అయినా ఎలాంటి భయం లేకుండా యథేటచ్ఛగా అక్రమ మద్యం వ్యాపారం కొనసాగిస్తున్నాడు.
విజయవాడలో నగరంలోని చాలా ప్రాంతాల్లో అక్రమంగా మద్యం అమ్మకాలు సాగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మద్యానికి బానిసలుగా మారిన వ్యక్తులు అప్పులపాలవుతున్నారు. వారి జీవితాలు రోడ్డుపై పడుతున్నాయి.
మరోవైపు నగరంలో తాగుబోతుల ఆగడాలు శ్రుతిమించాయి. కొన్ని చోట్ల రోడ్లపై వీరంగం సృష్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లలేకపోతున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.