Kurnool District News: గంటల వ్యవధిలో పెళ్లి.. పెళ్లి పందిరి తోరణాలతో కళకళలాడుతోంది. అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు. పెళ్లి కొడుకు కూడా సాంప్రదాయ వస్త్రధారణతో సిద్ధమవుతున్నాడు. అప్పుడే పిడుగులాంటి వార్త వినిపించింది అందరికీ. పెళ్ళి కుమార్తె కనిపించడం లేదంటూ.. కేకలు. ఇక అంతే పెళ్లి ఏర్పాట్లలో ఉన్న వారందరూ గుమికూడారు. ఇదేదో సినిమా సీన్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి సీన్స్ సినిమాలలో మనకు కనిపిస్తుంటాయి. ఇదే తరహా సీన్ నిజజీవితంలో కూడా సేమ్ టు సేమ్ జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసా కర్నూల్ జిల్లా పత్తికొండలో…
కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామంలో కొన్ని గంటల వ్యవధిలోనే జరగవలసిన వివాహం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణం వధువు, తను ప్రేమించిన ప్రేమికుడితో పరారీ కావడమే. అనంతపురం కు చెందిన యువతిని, కృష్ణగిరి మండలం లక్కసాగరం కు చెందిన యువకుడితో వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. తెల్లవారితే పెళ్లి జరగాల్సి ఉండగా, సాంప్రదాయం ప్రకారం పురోహితులు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇరువైపులా బంధువులు వివాహానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించేందుకు ఆశీనులయ్యారు. ఆ క్రమంలోనే కళ్యాణ వేదిక నుండి వధువు అదృశ్యమైంది. గంటల వ్యవధిలో జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా నిలిచిపోయింది.
దీనితో తమ కుమార్తె అదృశ్యమైందని, వధువు తండ్రి పత్తికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా కళ్యాణ మండపం సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వధువు ప్రేమించిన అబ్బాయి కళ్యాణ మండపం వద్దకు వచ్చి, బైక్ పై వధువును తీసుకు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. గంటల వ్యవధిలో జరగాల్సిన పెళ్లికి, వధువు అదృశ్యం కావడంతో వరుడి కుటుంబ సభ్యులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా వధువు తల్లిదండ్రులు మాత్రం తమ పరువు గంగపాలైందని తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు.
వధువు వివాహం నిశ్చయం కాకమునుపే, తన తల్లిదండ్రులతో అసలు విషయాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు అందరిలో నవ్వుల పాలయ్యామని వధువు తరుపు బంధువులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం సీసీ కెమెరాలో నమోదైన వీడియోల ఆధారంగా, సదరు యువకుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.