Kotamreddy Sridharreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత. నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. నిత్యం ప్రజల్లో తిరగడంతో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార పక్షం టీడీపీపై బలంగా పోరాడారు. అసెంబ్లీలోనూ, టీవీ డిబేట్లలో బలమైన వాయిస్ వినిపించారు. కేసులు ఎదుర్కొన్నారు. ఇలా వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితమైన నేతగా మారారు.
రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ ఆ జిల్లాలో మేకపాటి గౌతమ్ రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలోనైనా పదవి వస్తుందని ఆశించారు. కానీ భంగపాటు తప్పలేదు. ఈసారి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో ఆయన తీవ్రంగా నిరుత్సాహపడ్డారు. అనేక సందర్భాల్లో కోటంరెడ్డి తన ఆవేదనను బహిరంగంగానే వ్యక్తం చేశారు.
కొంతకాలంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. జిల్లాలో పది పెద్ద కుటుంబాలు తన గొంతు కోశాయని ఆరోపించారు. తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని , నా అనుకున్న వాళ్ల కోసం కొండలు, బండలైనా ఢీ కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో చేతులతో గోడలపై పార్టీ స్లోగన్లు రాశానని, చెట్లు ఎక్కి జెండాలు కట్టానని చెప్పుకొచ్చారు. లాఠీ దెబ్బలు తిన్నానని, జైలుకెళ్లానని గుర్తుచేశారు. నాయకులు, కార్యకర్తల కష్టంతో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు. తన తండ్రి ఎమ్మెల్యే కాదని తాత మంత్రి కాదని అన్నారు. తన కుటుంబానికి వేల కోట్ల రూపాయలు లేవన్నారు సామాన్య కుటుంబానికి చెందిన వాడినని పేర్కొన్నారు. అనేకసార్లు తనకు రాజకీయంగా అవకాశం వచ్చినా ఆయా పెద్ద కుటుంబాలు గొంతు కోశాయని ఆరోపించారు. ఎల్లకాలం వారి కుమారులు, బావమరుదులు, మనవళ్లు ఎమ్మెల్యేలుగా , మంత్రులుగా ఉండాలనుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా.. రెట్టించిన ఉత్సాహం, కసితో ముందుకు సాగానన్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మేకపాటి, ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, వేమిరెడ్డి, ఆదాల కుటుంబాలు ఎన్నోఏళ్లుగా చక్రం తిప్పుతున్నాయి. ఆయా కుటుంబాలను ఉద్దేశించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు గుప్పించడం తీవ్ర దుమారం రేపుతోంది. కోటంరెడ్డి వ్యాఖ్యలపై ఆయా కుటుంబాల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మరి వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే కొంతకాలంగా పార్టీపైనా, సీఎంపైనా నేరుగా విమర్శలు చేయకపోయినా.. తన ధిక్కార స్వరాన్ని మాత్రం కోటంరెడ్డి వినిపిస్తున్నారు. తనకు అన్యాయం జరుగుతోందని గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఏకంగా ప్రభుత్వంపైనే నేరుగా విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వైసీపీ అధిష్టానం వెంకటగిరి ఇన్ ఛార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించింది. మరి కోటంరెడ్డి విషయంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.