Kiraak RP: ఏపీలోని అధికార కూటమి, వైసీపీల మధ్య విమర్శల తాకిడి ఎక్కువైందని చెప్పవచ్చు. ఇటీవల అధికార పక్షం తరపున కొందరు, వైసీపీ తరపున కొందరు పచ్చగడ్డి మధ్య వేస్తే భగ్గుమనే రీతిలో విమర్శలకు పదును పెడుతున్నారు. అందులో టీడీపీ పక్షాన కిర్రాక్ ఆర్పీ, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల మధ్య విమర్శల జోరు కొనసాగుతూనే ఉంది. ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే అయినప్పటికీ.. పార్టీలు వేరు కావడంతో.. కొంచెం స్ట్రాంగ్ విమర్శలు కొనసాగుతున్నాయి.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో శ్యామల మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనప్పటికీ రాష్ట్రంలో ఘోరాలు జరుగుతున్నాయని విమర్శించారు. పుంగనూరు ఘటనపై ఆమె మాట్లాడుతూ.. కేవలం తమ పార్టీ అధినేత పర్యటన ఖరారైనందుకే.. ముగ్గురు మంత్రులు పాప కుటుంబ సభ్యులను పరామర్శించారని, రాష్ట్రంలోని శాంతిభద్రతలపై ప్రభుత్వానికి పట్టు లేదన్నారు. వంద రోజుల పాలనలో ఏ హామీ నెరవేర్చకుండా.. కూటమి ప్రజలను మభ్యపెడుతుందన్నారు. అలాగే నమ్మి ఓట్లేసిన ప్రజలను కూటమి పార్టీలు మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఇలా కూటమి ప్రభుత్వంపై విమర్శల జోరు సాగించారు ఆమె.
ఇక శ్యామల విమర్శలపై టీడీపీ తరపున కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ.. బంజారాహిల్స్ లోని ఒక కార్యాలయంలో కూర్చొని.. నన్ను మించిన రాష్ట్ర అధికార ప్రతినిధి లేరంటూ.. అబద్ధపు ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏపీలోని సందుల్లో మహిళలకు భద్రత లేదని ఎలా నిర్ధారిస్తారని, జరగని అఘాయిత్యాలను జరిగినట్లుగా చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు.
అంతటితో ఆగక.. వచ్చే ఎన్నికల సమయానికి మీ అధినేత, మాజీ సీఎం జగన్ కు ఓదార్పు అవసరమని, కానీ ఇప్పుడు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు పక్కకు తొలగారన్నారు. అందుకు లక్ష్మీ పార్వతి తల్లిగా.. రోజా ఒక చెల్లిగా.. మరో చెల్లిగా శ్యామల తోడు ఉండాలని కోరారు. అసలు చంద్రబాబు.. మహిళల కోసం ఏమి చేశారని శ్యామల అనడం విడ్డూరంగా ఉందన్నారు. డ్వాక్రా సంఘాలు, మహిళా కమిషన్, గ్యాస్ కనెక్షన్లు, ఫ్యామిలీ కోర్టులు, ఇంకా కొన్ని ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టింది బాబు కాదా అంటూ ప్రశ్నించారు.
Also Read: Ys Jagan: అస్సలు ఊహించలేదు కానీ.. షాకిచ్చాడు.. ఆ నేతపై ఫస్ట్ టైమ్ కామెంట్స్ చేసిన జగన్
తనకు , తన భార్యకు ప్రవేట్ కాల్స్ వస్తున్నాయని.. నా సతీమణి కూడా మహిళే కదా.. మరి ఆమెకు ఎవరు ప్రవేట్ కాల్స్ చేస్తున్నారన్నారు. అలాగే జనసేనలో ఉన్న రాయపాటి అరుణ, టీడీపీలో గల ఉండవల్లి అరుణ లాంటి మహిళలను ఉద్దేశించి సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు వారి మనోభావాలు దెబ్బతినవా అంటూ ప్రశ్నించారు. మీకు ఒక బిడ్డ ఉందని చెప్పారని, అందుకే అబద్ధాలు చెప్పకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజారంజక పాలన గురించి వాస్తవాలు మాట్లాడాలని శ్యామలకు.. ఆర్పీ సూచించారు.