Visakhapatnam : విశాఖ జిల్లాలో మరోసారి కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. కిడ్నీ అమ్మితే రూ.8.5 లక్షలు ఇస్తామంటూ కామరాజు, శ్రీను, ఎలినా అనే వ్యక్తులు వినయ్ కుమార్ అనే వ్యక్తికి డబ్బు ఆశ చూపారని ఆరోపణలు వచ్చాయి. డీల్ ప్రకారం కిడ్నీ ఇచ్చేందుకు బాధితుడు వినయ్ కుమార్ అంగీకరించాడు. పెందుర్తి పరిధిలోని తిరుమల హాస్పిటల్ కేంద్రంగా ఈ వ్యవహారం నడిచింది.
కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. DCP విద్యాసాగర్ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ పరమేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కామరాజు, శ్రీను, ఎలినా కోసం గాలింపు చేపట్టారు.
నిరుద్యోగులను, అమాయకులను టార్గెట్ చేసి డబ్బు ఆశ చూపి కిడ్నీ అమ్మేందుకు ఒప్పిస్తున్నారని తెలుస్తోంది. కిడ్నీ మార్పిడి జరిగాక… మాట్లాడుకున్న అమౌంట్ కంటే తక్కువ డబ్బులు ఇస్తున్నారని అంటున్నారు. కిడ్నీ రాకెట్లో ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచి ఈ దందా నడిపిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
విశాఖ జిల్లాలో కిడ్నీ మార్పిడి రాకెట్పై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. తిరుమల హాస్పిటల్లో DMHO తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రికి అనుమతులు లేవని తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తన కుమారుడి కిడ్నీ తీసిన నిందితులను శిక్షించాలని వినయ్ కుమార్ తల్లి డిమాండ్ చేశారు. తన కుమారుడిని బెదిరించి కిడ్నీ తీసుకున్నారని ఆమె ఆరోపించారు. కుటుంబానికి ఆధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ల కిందట కూడా విశాఖలో కిడ్నీ రాకెట్ కలకలం రేపింది. హైదరాబాద్కు చెందిన పార్థసారధి అనే వ్యక్తి నుంచి కిడ్నీ తీసుకుని చివరికి అతడ్ని మోసం చేసింది ఓ గ్యాంగ్. కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంటే మొదట రూ. 12 లక్షలు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత పార్థసారధికి కేవలం రూ. 5 లక్షలు ఇవ్వడంతో మోసపోయానని గ్రహించాడు. బాధితుడు పార్థసారధి మహారాణిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పట్లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు బహిర్గతమైంది.