Kavali Attack : నెల్లూరు జిల్లా కావలిలో అమానుష ఘటన జరిగింది. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బైక్ ను పక్కకు తీయాలని ఓ ఆర్టీసీ డ్రైవర్ హారన్ మోగించడమే అతను చేసిన పెద్ద పొరపాటైంది. బైక్ తీయమని హారన్ కొట్టిన ఆ బస్సు డ్రైవర్ ను వెంబడించి మరీ.. విచక్షణా రహితంగా దాడి చేశారు. కడుపులో కాలితో తన్ని.. పిడిగుద్దులతో అతనిపై విరుచుకుపడ్డారు. ఇక్కడే చంపి పాతేస్తాం.. ఎవరొస్తారో చూస్తామంటూ రెచ్చిపోయారు. ఇదంతా వీడియో తీస్తున్న కొందరి మొబైల్ ఫోన్లను లాక్కొని హంగామా చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాపై బాగా వైరల్ అవడంతో.. పోలీసులు స్పందించారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ16జెడ్ 0702 నంబర్ గల బస్సు గురువారం (అక్టోబర్ 26) సాయంత్రం కావలి నుంచి గమ్యస్థానానికి బయల్దేరింది. ఈ బస్సు ట్రంక్ రోడ్డు మీదుగా వెళ్తుండగా.. ఓ బైక్ రోడ్డుకు అడ్డంగా ఉండటంతో బస్ డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ మోగించారు. దాంతో సదరు వాహనదారుడు అతనిపై వాదనకు దిగాడు. ఆ సమయంలో వెనుక ఉన్న వాహనదారులంతా హారన్ మోగించడం, వన్ టౌన్ పోలీసులు కూడా అడ్డురావడంతో అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితులు దేవరకొండ సుధీర్, ఇతరులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. 14 మంది టీఎన్ సీ9 1612 నంబర్ కారులో ఆర్టీసీ బస్సును వెంబడించి.. డ్రైవర్ ను కిందికి దించి దాడికి పాల్పడ్డారు.
స్థానికులు, బస్సులో ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని డ్రైవర్ ను సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పై దాడికి పాల్పడిన దేవరకొండ సుధీర్, శివారెడ్డి, మల్లి, విల్సన్, కిరణ్ లతో పాటు మరో 10 మందిపై హత్యాయత్నం, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. నిందితులు ఎవరైనా.. వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై జరిగిన దాడిపై స్పందించిన ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత తన అవినీతి దందాలకు అడ్డువస్తున్నారని సొంత బాబాయ్ని వేసేస్తే.. ఆయన సైకో ఫ్యాన్స్ అలాగే ఉన్నారన్నారు. హారన్ కొట్టాడన్న కారణంతో ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. బైక్ తీయాలని హారన్ కొట్టడమే నేరమైందని.. వైసీపీ నేతలు పట్టపగలే గూండాల కంటే ఘోరంగా రెచ్చిపోయి దాడి చేశారని లోకేష్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జగన్ ఫ్యాక్షన్ ప్రదేశ్గా మారిందని.. సైకో జగన్ పోతేనే పిల్ల సైకో గ్యాంగ్లు పోతాయన్నారు. అప్పుడే రాష్ట్రానికి పట్టిన పీడా విరుగడవుతుందంటూ కావలి ఘటన వీడియోను నారా లోకేష్ పోస్ట్ చేశారు.