Kapu Ramachandra Reddy | వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబం
వెంటే నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంతు వచ్చింది. తనను నమ్మించి నట్టేట ముంచారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన జగన్కు రాంరాం చెప్పేశారు
Kapu Ramachandra Reddy | ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్ల కసరత్తు మొదటికే మోసం తెస్తోందా?.. అంటే సొంత పార్టీ నుంచే అవునన్న సమాధానం వస్తోంది . సిట్టింగులు, ఇన్చార్జ్ల మార్పుచేర్పులతో జగన్కు అత్యంత వీరవిధేయులే పార్టీని వీడుతుండటం అంతుకు నిదర్శనంగా నిలుస్తోంది … ఆయన నమ్మినబంట్లుగా ఉన్న వారే. ఒకొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు .. జగన్ దగా చేశారనీ, ఆయన పార్టీకో దండం, ఆయనకు పది దండాలంటూ శాపనార్ధాలు పెట్టి మరీ వెళుతున్నారు. తాజాగా ఆ లిస్ట్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రరెడ్డి చేరారు .. దాంతో రానున్న రోజులలో ఇంకెంత మంది ఆ బాట పట్టనున్నారో అన్న చర్చ మొదలైంది
ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి … అభ్యర్థుల మార్పు పేరుతో వైసీపీ అధినేత కసరత్తు చేస్తూ .. మార్పుచేర్పుల లిస్ట్లు రిలీజ్ చేస్తున్నారు. పలువురు సిట్టింగ్లకు అధినేత మొండి చేయి చూపెడుతున్నారు. దీంతో అనేక మంది పార్టీ వీడుతున్నారు.. అలా గుడ్ బై చెప్తున్న వారిలో జగన్ హార్డ్కోర్ భక్తులుగా పేరున్న నేతలు కూడా ఉండటం గమనార్హం.జగన్ కు అత్యంత విధేయుల తిరుగుబాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైంది.
తాజాగా వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబం వెంటే నడిచిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వంతు వచ్చింది. తనను నమ్మించి నట్టేట ముంచారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన జగన్కు రాంరాం చెప్పేశారు. జగన్ అపాయింట్మెంట్ కూడా దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు…తనకు అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని. తాను, తన భార్య రాయదుర్గం, కళ్యాణదుర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. గెలిచి చూపిస్తామని జగన్కు సవాల్ విసిరారు .
రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహిత నేత. జగన్ తో మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యే. 2009 లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యే గా గెలిచి .. ఆ తర్వాత జగన్ కోసం నిలబడ్డ అతికొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకరు… జగన్ కు అత్యంత ఆప్తుడైన గాలి జనార్ధన్ రెడ్డికి ఒకప్పుడు కాపు రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి కూడా. అయితే ఇటీవల కాలంలో కాపు రామచంద్రారెడ్డికి గాలి జనార్ధన్ రెడ్డితో విభేదాలు, వివాదాలు తలెత్తాయంటారు. ఆ ఎఫెక్ట్తోనే ఇప్పుడు జగన్.. కాపు రామచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వలేదన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.
అదీ కాక కాపు రామచంద్రారెడ్డి అల్లుడు ప్రభుత్వ కాంట్రాక్టుల పనులు చేస్తూ బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా కాపు రామచంద్రారెడ్డి జగన్ ను పల్లెత్తు మాట అనలేదు. అన్ని విధాలుగా, చివరికి ప్రభుత్వ నిర్వాకం వల్ల సొంత అల్లుడు ఆత్మహత్య చేసుకున్నా.. కాపు రామచంద్రారెడ్డి జగన్ విధేయతను వీడలేదు. అటువంటి తనను జగన్ ఇంత దారుణంగా మోసం చేయడంతో తట్టుకోలేక బ్రేక్ అయ్యారు. తన భార్యతో సహా ఇండిపెండెంట్గా పోటీ చేసి తనతడాకా చూపిస్తానంటూ జగన్ కే సవాల్ విసిరారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతం రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న బీసీ వర్గ నేత కాపు రామచంద్రారెడ్డి స్థానంలో రెడ్డి సామాజికవర్గం నాయకుడ్ని బరిలోకి దించడానికి సన్నహాలు చేస్తోంది వైసీపీ. రాయదుర్గం టికెట్ రేసులో మాజీ టిడిపి నేత ప్రస్తుత ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ముందు వరసలో కానిపిస్తున్నారు … ఆయన కాకపోతే కర్ణాటక ఓఎంసీలో పనిచేసిన శ్రీనివాసరెడ్డి రంగంలోకి దింపాలని చూస్తున్నారంట … ఎవరిని బరిలోకి దింపినా వైసీపీకి రాయదుర్గంలో పరిస్థితి సానుకూలంగా కనిపించడం లేదంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోతూ పోతూ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీలో ఉంటానంటూ జగన్కు సవాల్ చేస్తూ బాంబు పేల్చారు. ఈ పరిణామం ఖచ్చితంగా వైసీపీ కి పెద్ద దెబ్బగా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. రాయదుర్గంతో పాటు కళ్యాణదుర్గంలో తాను, తన భార్య పోటీ చేస్తామంటూ ప్రకటించి ఆ సెగ్మెంట్ల వైసీపీ నేతల్లో గుబులు రేపారు. ఇలాంటి పరిస్థితుల్లోవైసీపీ అధిష్టానం అలెర్ట్ అయి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తో ఏమైనా రాయభారం నడుపుతుందా? లేకపోతే లైట్ తీసుకుంటుందో చూడాలి.