Kanna Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సైకిల్ ఎక్కాడు. ఇటీవల కాశాయం పార్టీకి రాజీనామా చేసిన కన్నా.. తాజాగా పసుపు కండువా కప్పుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.
గుంటూరులోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరి చేరుకున్నారు. వందలాది మంది అనుచరులు ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు నాయుడుతో కన్నా సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2.48 గంటలకు చంద్రబాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు అతని అనుచరులు వందలాది మంది పసుపు కండవా కప్పుకున్నారు.
కన్నా లక్ష్మీనారాయణను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. విద్యార్థి దశ నుంచి కన్నా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. రాజకీయాల్లో నిబద్ధత ప్రకారం కన్నా పనిచేశారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్మమని వెల్లడించారు.