Kadiyam Farmers: నూతన సంవత్సరానికి తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. యువ నర్సరీ రైతులు విన్నూత్న రీతిలో ఏర్పాటుచేసిన అద్భుత కూర్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాది స్వదేశీ, విదేశీ మొక్కలతో పదుల సంఖ్యలో కూలీలు గత వారం రోజులుగా శ్రమించి వీటిని తీర్చిదిద్దారు. కడియపులంక పుల్లా ఆంజనేయులుకు చెందిన శ్రీ సత్యదేవ నర్సరీలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మొక్కలతో ఈ అయోధ్య రామాలయాన్ని ఎంతో అద్భుతంగా రూపొందించారు.
సుమారు 50 వేల మొక్కలు, పువ్వులతో తీర్చిదిద్దారు. నర్సరీలో ఏర్పాటు చేసిన 2024 సంవత్సరం స్వాగత ఏర్పాట్లు కూడా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేలాది మొక్కలతో రూపొందించిన ఈ నూతన సంవత్సర స్వాగత కూర్పు సందర్శకులను రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. 2024 సంవత్సరానికి స్వాగతం పలకడంలో కడియం నర్సరీ రైతులు తమ మార్కును ప్రదర్శించారు.