Wayanad Tragedy: కేరళలోని వయానాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి జరిగిన విషాదం దేశాన్ని కలవరపెట్టింది. ఊరుకు ఊరే శిథిలాల కింద కొట్టుకుపోయింది. పక్కనే ఉన్న నది పొంగిపొర్లింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో గాఢ నిద్రలో ఉన్న చాలా మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ ప్రకృతి బీభత్సంలో కనీసం 360కి పైగా మరణించారు. ఈ విషాదంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత సహా చాలా మంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొన్నటి వరకు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. అయితే, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకుల పర్యటన పెద్దగా లేదు. మృతులకు సంతాపం చెప్పి మిన్నకుండినవారి సంఖ్యే ఎక్కువ. మరికొందరు తోచినంత సహాయాన్ని ప్రకటించారు. కానీ, కేఏ పాల్ సంతాపంతో సరిపెట్టుకోలేదు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. ఆయన వయానాడ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది చనిపోవడం హృదయ విదారకమని బాధపడ్డారు.
రాజ్యసభ ఎంపీ సంతోష్తో కలిసి కేఏ పాల్ ఈ కొండచరియలు విరిగిపడిన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన చూరల్మలా గ్రామానికి వెళ్లారు. అక్కడ బాధితులను పరామర్శించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఓ వీడియోలో పంచుకున్నారు. కేఏ పాల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక్కడ పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయని, సంపన్నులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, యాక్టివిస్టులు, ఫిలాంథ్రోపిస్టులు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కేేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. కేరళలో విలయానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా సరిగా స్పందించట్లేదని విమర్శించారు. అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి సహాయం చేయాలని కోరారు. అందరూ కేరళ సీఎం విపత్తు నిధికి విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కేరళలో ఎక్కువగా క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది. అక్షరాస్యత కూడా అధికమే.
కేఏ పాల్ తన మాటలు, చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. చాలా సార్లు ఆయన తన కాన్ఫిడెన్స్తో నివ్వెరపరుస్తుంటారు. తప్పును తప్పు అని చెప్పడంలో ఎంతమాత్రం వెనుకాడరు. నిజాయితీగా పొరపాట్లనూ ఒప్పుకుంటారు. పెద్ద పెద్ద నాయకులకు అలవోకగా సవాళ్లు విసురుతారు. ఎవరు సవాల్ చేసినా తప్పకుండా సమాధానం చెబుతారు.
Also Read: పారిస్ ఒలింపిక్స్.. హాకీలో బ్రిటన్పై గెలిచి సెమీస్కు దూసుకెళ్లిన భారత్
పాస్టర్గా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందిన కేఏ పాల్కు పొలిటికల్ ఎంట్రీ కలిసిరాలేదు. చాలా సార్లు ఆయన అవహేళనను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రజా శాంతి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా డిజాస్టర్ రిజల్ట్స్ వచ్చాయి. అయినా ఆయన స్థైర్యం చెదరలేదు.