JD Laxminarayana : జేడీ లక్ష్మీనారాయణ ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు హాట్ టాపిక్. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును సీబీఐ జాయింట్ డైరెక్టర్ హోదాలో దర్యాప్తు చేసింది ఆయనే. ఆ సమయంలో ఉమ్మడి ఏపీలో జేడీ పేరు మారుమోగింది. మీడియాలో కొన్నాళ్లపాటు ఆ కేసు వార్తలే ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా ప్రచారం చేశారు. దీంతో జేడీ పేరు బాగా పాపులర్ అయ్యింది. చాలా సిన్సియర్ ఆఫీసర్ గా ఆయనకు పేరుండటం, జగన్ కేసుల దర్యాప్తును ఆయనకే కేటాయించడంతో మరింత పాపులర్ అయ్యారు. ఆయన అసలు పేరు వీవీ లక్ష్మీనారాయణ అయితే జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తుతో జేడీ లక్ష్మీనారాయణగా మారిపోయింది.
ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లో జేడీ ఎంట్రీ ఇచ్చారు. తొలుత ఆయనే కొత్త పార్టీ పెడతారని ప్రచారం సాగింది. ఆ తర్వాత టీడీపీలో చేరతారని, బీజేపీ కండువా కప్పుకుంటారని ఇలా చాలా ప్రచారాలు జరిగాయి. కానీ అనూహ్యంగా జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. 2014 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల ప్రచారాన్నే వినూత్నంగా చేపట్టారు. తాను పోటీ చేస్తున్న విశాఖకు స్పెషల్ మేనిఫేస్టోను రిలీజ్ చేశారు. ఆ హామీలను 100 రూపాయల బాండ్ పేపర్ పై రాసి సైన్ చేసి రిలీజ్ చేశారు.’Reach your MP’ పేరిట యాప్ను రిలీజ్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతానని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడతానని స్పష్టం చేశారు. విశాఖను ఆదర్శ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఇలా ఎంతో పెయిర్ పాలిటిక్స్ చేసినా జేడీ.. కమర్షియల్ రాజకీయ నాయకుల ముందు నిలవలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
2019 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణకు 4,36, 906 ( 35.24 శాతం) ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి భరత్ కు 4,32, 492 ( 34. 89 శాతం) ఓట్లు పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ 2, 88, 874 ఓట్లు తెచ్చుకోగలిగారు. అంటే 23.3 శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పురందేశ్వరికి 33 వేల 892 ఓట్లు మాత్ర వచ్చాయి. అంటే 2.7 శాతం. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హరిబాబు 48 శాతం ఓట్లు తెచ్చుకుని వైసీపీ అభ్యర్థి జగన్ తల్లి విజయమ్మపై విజయం సాధించారు. అప్పుడు విజయమ్మ 40 శాతం ఓట్లు తెచ్చుకున్నా గెలవలేకపోయారు. ఎందుకంటే ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ రెండు పార్టీలకు జనసేన మద్దతు ఇచ్చింది.
అదే 2019లో వైసీపీ అభ్యర్థికి 35 శాతం ఓట్లు వచ్చినా గెలిచారు. ఎందుకంటే బీజేపీ, జనసేన, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అందుకే ఈసారి టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే విశాఖలో ఆ కూటమి అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. మరి బీజేపీ కూడా ఈ కూటమిలో కలిస్తే.. ఆ సీటు బీజేపీకి కేటాయిస్తే మళ్లీ 2014 ఫలితాలు రీపీట్ అవుతాయంటున్నారు.
ఈ లెక్కలు ఇలా ఉంటే.. జేడీ లక్ష్మీనారాయణ మరోసారి విశాఖ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా తన మనసులో మాటను బయటపెట్టారు. తన ఆలోచనకు దగ్గర ఉన్న పార్టీలో చేరతాననే సంకేతాలు ఇచ్చారు. అదేసమయంలో స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ప్రకటించారు. మరి జేడీ జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టే ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. అలాగే టీడీపీలో చేరినా విశాఖ టిక్కెట్ కేటాయించడం కష్టం ఎందుకంటే.. అక్కడ బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి మళ్లీ ఆయనకే టీడీపీ టిక్కెట్ దక్కుతుంది. జేడీకి మిగిలిన ఆఫ్షన్ బీజేపీ ఒక్కటే. మరి జేడీ కాషాయ కండువా కప్పుకుంటారా? లేదంటే స్వతంత్ర అభ్యర్థిగానే బరిలో నిలుస్తారా.?