Jagan : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో ఏపీ సీఎం జగన్.. మరోసారి చంద్రబాబును టార్గెట్ చేశారు. టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. తన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెప్పమని సీఎం వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు.
టార్గెట్ చంద్రబాబు..
ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని గతంలో బీసీలను చంద్రబాబు బెదిరించారని, తోకలు కత్తిరిస్తానన్నారని జగన్ అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చంద్రబాబుకు గుర్తు చేయాలని కోరారు. చేసిన మోసాలను, నయవంచనను గుర్తు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ఒంటరి పోరుకు సిద్ధమా..
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి చంద్రబాబు సిద్ధమా అని జగన్ సవాల్ విసిరారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోందన్నారు. 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పలేకపోతున్నారని విమర్శించారు. చేసిందేమీ లేక అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చెప్పుకోవడానికి చంద్రబాబు బీసీల కోసం ఒక్క మంచి పని చేయలేదన్నారు.
దోచుకో..పంచుకో..తినుకో..
బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశామని సీఎం జగన్ స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్ద పీట వేశామన్నారు. ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల 19 వేల 228 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఇందులో 80 శాతం డబ్బు పేద సామాజిక వర్గాలకు ఖర్చు చేశామని తెలిపారు. చంద్రబాబు హయాంలో అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం ఉంటే ఇప్పుడు ఆ రేటు కేవలం 15 శాతం మాత్రమే అని సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో ఇదే చంద్రబాబు విధానం అని జగన్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ.. బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ప్రతి గడపకు అందే సామాజిక న్యాయం, సాధికారతే నవరత్నాలు అని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారని జగన్ విమర్శించారు. ఇప్పుడు అన్ని వర్గాలను తాము గుండెల్లో పెట్టుకున్నామని తెలిపారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు కృషి చేశామన్నారు. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.
బీసీలకు పెద్దపీట
చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదని జగన్ తెలిపారు. తన ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించామన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చామని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారని తెలవిపారు. 32 మంది ఎమ్మెల్సీలలో 18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైన్టార్టీలే ఉన్నారని వివరించారు. శాసన సభ స్పీకర్గా బీసీ నేత తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్గా ఎస్సీ నేత మోషేన్రాజును నియమించామని చెప్పారు. మొత్తంగా రాజకీయ, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
బీసీల గుండెల్లో జగన్..జగన్ గుండెల్లో బీసీలు
నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు అని జగన్ అన్నారు. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసు కాదు.. బ్యాక్బోన్ క్లాసు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయన్నారు.
బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ
ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని జగన్ తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టిందన్నారు. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పానని నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేశామని, దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చామన్నారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించామని తెలిపారు. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.