Pawan Kalyan Will Contest the Elections from Pithapuram(AP MLA election live updates): జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇన్నాళ్లూ నెలకొన్న ఉత్కంఠ వీడింది. తాను పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్నాని జనసేనాని స్వయంగా ప్రకటించారు.
ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. మరోసారి భీమవరం నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. అయితే మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరడంతో ఆ ప్రచారానికి తెరపడింది. రామాంజనేయులకు భీమవరం టిక్కెట్ కేటాయించారు.
ఇంతకుముందు కాకినాడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. జనసేనాని కాకినాడ టూర్ సమయంలో ఈ వార్తలు బాగా వచ్చాయి. గాజువాక నుంచి మళ్లీ బరిలోకి దిగుతారే చర్చ జరిగింది. అలాగే తిరుపతి నుంచి జనసేనాని పోటీ చేస్తారని ప్రచారం సాగింది. ఇలా చాలా నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి పవన్ కల్యాణ్ పిఠాపురంను ఎంచుకున్నారు.
Read More: రెండో జాబితా ప్రకటించిన టీడీపీ.. 34 మంది అభ్యర్థులు వీరే!
2019 ఎన్నికల సమయంలోనూ పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. రెండోచోట్లా ఓడిపోయారు. గాజువాకలో పవన్ కల్యాణ్ పై వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. భీమవరంలోనూ వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ .. పవన్ ను ఓడించారు.
2014 ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీలతో స్నేహానికి గుడ్ బై చెప్పారు. ఒంటరిగా బరిలోకి దిగారు. పార్టీ అధ్యక్షుడే రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన ఒకే ఒక్క సీటు గెలిచింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొంతకాలానికే ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.
Also Read: Pithapuram Assembly Constituency : పిఠాపురం సెంటిమెంట్.. పవన్ కల్యాణ్ గెలుపు నల్లేరుపై నడకేనా..!
2019లో ఓటమి తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత టీడీపీతోనూ స్నేహహస్తం మళ్లీ అందుకున్నారు. తొలుత టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఆ తర్వాత బీజేపీతోనూ పొత్తు కుదరడంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యహరించారు. అయితే పవన్ కల్యాణ్ ఎంపీగానూ బరిలోకి దిగుతారని వార్తలు షికారు చేశాయి. జనసేనాని కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. ఈ అంశంపైనా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. తాను ఎంపీగా పోటీ చేయడంలేదని ప్రకటించారు.