JanaSena : కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో పవన్ సమావేశమవుతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా డివిజన్లవారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
సర్పవరం బహిరంగసభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్ కల్యాణ్ శపథం చేశారు. అతన్ని ఓడించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ సవాల్ విసిరారు. ఇవాళ సుమారు 15 డివిజన్లకు చెందిన నాయకులతో పవన్ పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నిన్న.. 15 డివిజన్లకు చెందిన జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు.
ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా పవన్ మాట్లాడుతున్నారు. వార్డుల్లో సమస్యలు ఏంటి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాకినాడ మీటింగ్ తర్వాత.. తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్చార్జిలతో పవన్ సమావేశం అవుతారు.