Pawan Kalyan : పిఠాపురంలో తన గెలుపుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసమే ఇక్కడ నుంచి పోటీకి దిగడం లేదన్నారు. భీమవరం , గాజువాక నియోజకవర్గాలతోపాటు పిఠాపురం కూడా తన ముఖ్యమేనని స్పష్టం చేశారు.
పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేయబోతున్నానో జనసేనాని వివరించారు. చాలా మంది పిఠాపురం నుంచి పోటీ చేయాలని కోరారని వెల్లడించారు. నియోజకవర్గానికి చెందిన చాలామంది కార్యకర్తలు, నాయకులు తనను గెలిపిస్తామనే హామీ ఇచ్చారని తెలిపారు. అందుకే పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నానని చెప్పుకొచ్చారు.
పిఠాపురం నియోజకవర్గంలో మార్పు మొదలైందని జనసేనాని అన్నారు. కులాల మధ్య ఐక్యత మొదలైందని తెలిపారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నేతలతో జనసేనాని భేటీ అయ్యారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు , కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు.
Also Read: టీడీపీ ఎంపీ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు.. నేడు తొలి జాబితా విడుదల..!
టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే తాజాగా కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి పేరును ప్రకటించారు.
తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను కాకినాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ సమయంలో ఉదయ్ శ్రీనివాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. పార్టీ కోసం, తన కోసం త్యాగం చేశారని తెలిపారు.
ఎంపీగా పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనను ఎంపీగా పోటీ చేయమంటే అప్పుడు తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అలా జరిగితే కాకినాడ నుంచి తాను ఎంపీగా బరిలో ఉంటానని తెలిపారు. పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు.