టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై ఏపీ సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నాలుగో విడత వైఎస్ఆర్ కాపునేస్తం నిధులను సీఎం జగన్ ను విడుదల చేశారు. 3,57,844 మందికి రూ.536.77 కోట్లు జమ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన వేదికపై స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై స్పందించారు.
స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని జగన్ ఆరోపించారు.ఫేక్ అగ్రిమెంట్ తో ప్రభుత్వ ఖజానాను దోచేశారని విమర్శించారు.ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారని వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంతో తమకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందన్నారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగలను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిందని తెలిపారు. ఒత్తిడి తీసుకొచ్చి సంతకాలు పెట్టి నిధులు దోచేశారని మండిపడ్డారు. నిధులు సూట్ కేసు కంపెనీలకు మళ్లించారని ఈడీ తేల్చిందన్నారు. ఈడీ అరెస్ట్ చేసినా ఐటీ నోటీసులిచ్చినా ఇంకా బుకాయిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తానని అన్నవాడు ప్రశ్నించడన్నారు.
చంద్రబాబు పీఏకు ఐటీశాఖ నోటీసులు ఇచ్చిందని జగన్ తెలిపారు. రూ. 371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది ? అని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకున్న వ్యకిని కాకుంటే ఎవరిని అరెస్ట్ చేయాలి ? అని నిలదీశారు. అవినీతి సొమ్ములో చంద్రబాబు ఇచ్చిన వాటాలు తీసుకున్నవారు ప్రశ్నించరన్నారు. ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకరని అంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి జగన్ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రజలంతా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.
45 ఏళ్ల నుంచి బాబు దోపిడీనే రాజకీయంగా మార్చుకున్నారని జగన్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులోనూ చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. ఆడియో టేపుల్లో అడ్డంగా దొరికారన్నారు. ఇప్పుడు కూడా సాక్ష్యాధారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారని మండిపడ్డారు.