Jagan : విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఏపీ సీఎం మరోసారి రాజధానిపై కీలక ప్రకటన చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మారుతుందని స్పష్టం చేశారు. త్వరలో ఇక్కడ నుంచే పరిపాలన సాగిస్తామని వెల్లడించారు.
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను జగన్ వివరించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయని తెలిపారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని చెప్పారు. గ్రీన్ ఎనర్జీపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు.
దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని సీఎం జగన్ అన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో తొలిరోజే 92 ఎంవోయూలు జరుగుతాయని తెలిపారు. మొత్తం రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయని వివరించారు. కొత్తగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులతో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు.
ముఖేష్ అంబానీ స్పీచ్..
సమ్మిట్లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉందని ముఖేష్ అంబానీ అన్నారు. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారని గుర్తుచేశారు. నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుందని ముఖేష్ అంబానీ చెప్పారు.