Visakhapatnam : విశాఖ నుంచే పాలన.. కొంత కాలంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇదే మాట పదే పదే చెబుతున్నారు. చేతలు మాత్రం నత్తనడకగానే ఉన్నాయి. తొలుత ఈ ఏడాది ఉగాది నుంచే విశాఖ నుంచి పాలన అన్నారు. అమరావతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో తీర్పు తర్వాత రాజధాని తరలిస్తారని భావించారు. ఆ తర్వాత సెప్టెంబర్ లో వైజాగ్ వెళతామన్నారు.
వాస్తవానికి జూలై 11న సుప్రీంకోర్టులో అమరావతిపై విచారణ జరగాల్సి ఉండగా.. డిసెంబర్ కు వాయిదా పడింది. దీంతో రాజధాని తరలింపు సెప్టెంబర్ లో ఉండదని తేలిపోయింది. కానీ తర్వాత విశాఖ నుంచి పాలనపై సీఎం జగన్ , మంత్రులు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. రాజధాని తరలింపు కార్యాచరణ కనిపించలేదు. డిసెంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు వస్తే.. ఆ తర్వాత కొన్నిరోజులకే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుకు రాజధాని తరలింపు ఉండదనేది స్పష్టమైంది. కానీ తాజాగా రాజధాని తరలింపుపై కొత్త అప్ డేట్ వచ్చింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో వైజాగ్ షిఫ్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి వైజాగ్ కేంద్రంగానే పరిపాలన కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దసరా నాటికి జగన్ విశాఖకు వెళ్తారని.. అక్కడ కొత్త ఇల్లుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.
ఒకవేళ సీఎం వైఎస్ జగన్ అక్టోబర్లో వైజాగ్ వెళ్లకపోతే అమరావతి నుంచే పాలన కొనసాగిస్తారు. దీనిపై త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.