Jagan : అన్ని ప్రాంతాలు బాగు పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన సీఎం.. భోగాపురం ఎయిర్పోర్ట్కు , తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులకు, చింతపల్లి ఫిష్ల్యాండింగ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలస ప్రాంతంగా ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు జాబ్ హబ్గా మారబోతోందని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీర్తికిరీటంగా మారుతుందని స్పష్టం చేశారు.
భోగాపురం ఎయిర్పోర్టు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంకు సమానదూరంలో ఉందని సీఎం చెప్పారు. మరో మూడేళ్లలో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. 2026 నుంచి ఇక్కడ విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుందని తెలిపారు. ఉత్తరాంధ్రను బాగుచేయాలనే లక్ష్యంతో బలంగా అడుగులు ముందుకేస్తున్నామన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా మూలపేట వద్ద పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
విజయనగరం జిల్లాలో 49 గ్రామాలు, విజయనగరం పట్టణం, భోగాపురం ఎయిర్పోర్టుకు తాగునీటితోపాటు, 30 వేల ఎకరాలకు సాగునీరు అందించే తారకరామతీర్థ సాగర్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు రూ.195 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నీ 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామన్నారు. చింతపల్లిలో రూ.24 కోట్లతో ఫిష్లాండ్ సెంటర్ నిర్మిస్తున్నామని తెలిపారు. విశాఖలో ఏర్పాటయ్యే అదానీ డేటా సెంటర్ తో ఏపీ ముఖచిత్రమే మారబోతోందని సీఎం జగన్ అన్నారు.
ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలలో కేసులు వేసి అడ్డుపడ్డారని విమర్శించారు. అన్ని ఆటంకాలు దాటుకుని ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. మెడికల్ టూరిజం, ఐటీ, ఇండస్ట్రీస్కు కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ మారబోతోందని తెలిపారు. 2026లో వచ్చి ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తానని అన్నారు. అనుకున్న సమయానికే ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని జీఎంఆర్ సంస్థ హామీ ఇచ్చిందని తెలిపారు.
ఉత్తరాంధ్ర పేరు చెప్పగానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గుర్తుకొస్తారని సీఎం జగన్ అన్నారు. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం. బ్రిటీషర్లను గడగడలాడించిన అల్లూరి జన్మించిన గడ్డ ఇది అని పేర్కొన్నారు. అందుకే కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టామని చెప్పారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. జూన్లోనే కిడ్నీ రీసెర్చ్ సెంటర్లను జాతికి అంకితం చేస్తామన్నారు. ఇచ్చాపురం, పలాసలకు రక్షితతాగు నీరు అందిస్తామని, సాలూరులో డ్రైవర్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సెప్టెంబర్ నుంచే విశాఖ నుంచి పాలన నడుస్తుందని మరోసారి సీఎం జగన్ స్పష్టం చేశారు.