Kuppam: 175కి 175. జగన్ టార్గెట్ ఇది. ఏపీ మొత్తం క్లీన్ స్వీప్. అంటే, కుప్పంలో కూడా వైసీపీనే గెలవాలనేది జగన్ లెక్క. మరి, దశాబ్దాలుగా కుప్పంను ఏలుతున్న చంద్రబాబును ఓడించడం అంత ఈజీనా? అంటే, కాస్త కష్టపడితే ఈజీగానే బాబును ఓడించొచ్చు అంటోంది వైసీపీ. ఇప్పటికే ఆ దిశగా అనేక చర్యలు చేపట్టింది. కుప్పంపై స్వయంగా సీఎం జగనే స్పెషల్ ఫోకస్ పెట్టారు. కార్యచరణ సిద్ధం చేసి.. అమలు బాధ్యతలు మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అందుకే, కుప్పం ఇప్పుడు కుతకుత ఉడుకుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లోనే టీడీపీని దారుణంగా దెబ్బకొట్టింది వైసీపీ. మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. మంత్రి పెద్దిరెడ్డి కుప్పంలో మకాం వేసి మరీ, పోలింగ్ సరళిని మేనేజ్ చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ ప్రజాప్రతినిధుల సంఖ్యే ఎక్కువ. వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడి గెలిచిందనేది టీడీపీ ఆరోపణ.
చంద్రబాబు మాత్రం కేడర్ నే నమ్ముకున్నారు. కుప్పం తన ఇలాఖా అంటున్నారు. ఇప్పటికీ బాబుకు ప్రజాధారణ ఎక్కువే. అభిమానం ఉన్నా.. ఓటింగ్ సమయానికి వైసీపీ ఏం చేస్తుందోననే భయం మాత్రం లేకపోలేదు. అందుకే, గతంలో ఎప్పుడో గానీ కుప్పం ముఖం చూడని చంద్రబాబు.. ఈమధ్య తరుచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కేడర్ ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక, సీఎం జగన్ కుప్పంలో తనదైన స్టైల్ పాలన సాగిస్తున్నారు. కుప్పంను రెవెన్యూ డివిజన్ గా చేసి నిధుల వరద పారిస్తున్నారు. చంద్రబాబు కుప్పంకు చేసిందేమీ లేదని.. కనీసం రెవెన్యూ డివిజన్ కూడా చేయలేదని.. అసలైన అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానంటున్నారు. కుప్పంలో అద్దంలాంటి రోడ్లు వేయించారు. 1వ తారీఖు ఉదయం 7 గంటల కల్లా పింఛన్లు వేస్తున్నారు. పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తున్నారు. అలా తటస్తులను ఆకర్షిస్తున్నారు.
భరత్ ను కుప్పంలో వైసీపీ అభ్యర్థిగా రెండేళ్లు ముందుగానే ప్రకటించారు జగన్. ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టి ఫుల్ పవర్స్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రిని కూడా చేస్తానని ముందే హామీ ఇచ్చారు. ఇలా పార్టీని అత్యంత పటిష్టంగా మార్చేసి.. అదే సమయంలో టీడీపీని దెబ్బకొడుతున్నారు జగన్. చంద్రబాబును, టీడీపీని భయాందోళనలకు గురి చేసి.. డిఫెన్స్ లో పడేలా చేసే ఎత్తుగడ అవలంభిస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు పర్యటనను పదే పదే అడ్డుకోవడం.. టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. తాజాగా చంద్రబాబు సభలు, ర్యాలీలకు అనుమతి నిషేధించడం.. ఇలా వరుస చర్యలతో కుప్పంలో ఇక టీడీపీ పని ఖతం అనేలా మెసేజ్ ఇస్తున్నారు. అయితే, చంద్రబాబుపై చేస్తున్న ఈ అతి బలప్రదర్శనపై ప్రజల్లో నుంచి వ్యతిరేకత కూడా వస్తోందని అంటున్నారు. వైసీపీ చేష్టలను చీదరించుకుంటున్నారని తెలుస్తోంది. ఎవరేమనుకున్నా తగ్గేదేలే అన్నట్టు కుప్పంలో చంద్రబాబు ఓటమిని జగన్ ఛాలెంజ్ గా తీసుకున్నారని అంటున్నారు.
అయితే, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులలో ఇలాంటి స్ట్రాటజీనే అప్లై చేసి ఫెయిల్ అయ్యారనే వాదనా వినిపిస్తోంది. పులివెందులకు పట్టిసీమ నుంచి నీళ్లు తరలించారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. అంతచేసినా.. 2019 ఎన్నికల్లో పులివెందులలో జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయారు. మరి, ఈసారి కుప్పంలో ఏం జరగబోతోంది? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.