ఏపీలో వైసీపీ ఎన్నికల వ్యూహం బెడిసికొట్టేలా ఉంది. మార్పుల చేర్పులంటూ వేసుకున్న ప్లాన్ జగన్కు తలనొప్పిగా మారింది. రోజు రోజుకి పెరుగుతున్న అసంతృప్తుల జ్వాలతో అమోయంలో పడింది వైసీపీ అధిష్టానం.
ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్లీన్ స్వీప్ దిశగా.. 175 సీట్లే టార్గెట్గా జగన్ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టారు. దీంతో పలువురు నేతలు పక్క చూపులు చూడగా.. మరికొందరు పార్టీకి గుడ్బై చెప్పి భవిష్యత్ కార్యాచరణను మొదలు పెట్టేశారు. దీంతో పైకి అంతా ఒకే అని గాంభీర్యం ప్రదర్శిస్తున్నా వైసీపీ అగ్రనాయకత్వం లోలోపల మాత్రం ఆందోళనకు గురవుతోంది. కాగా.. మొన్నటి వరకూ 40 మందికి టికెట్లు లేవన్న అధిష్టానం.. అసంతృప్తుల జ్వాలతో బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టింది. ఈ మేరకు 40 నుంచి ఇప్పుడు 20కి కుదించేసింది. ఆ 20లో ఆరుగురికి రాజ్యసభ్య సభ్యులుగా, మిగిలిన వారికి రాష్ట్ర స్థాయిలో పదవులు, ఎమ్మెల్సీలుగా హామీ ఇచ్చి బుజ్జగిస్తోంది.
జగన్ మార్పులు చేర్పులతో తమ సీటుకు ఎసరు పడుతుందనున్న నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో నేతలు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఆర్కే, రాంబాబుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు పార్టీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోపక్క వైసీపీ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండ్రోజుల్లో సుమారు 50 నుంచి 60 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ లిస్టులో కొందరు కొత్తవారికి అవకాశం కల్పిస్తుండగా.. మరికొందరికి స్థానాలు మార్చే ఛాన్స్ ఉంది. అలాగే ఇంకొందరు నేతలను పక్కన పెట్టినట్టు ప్రచారం. ఇక ఎన్నికల ఎత్తుగడలో భాగంగా జనవరి 1 నుంచి ప్రారంభంకానున్న పెన్షన్ల పెంపులో కొత్త ఇన్చార్జిలను భాగస్వామ్యం చేయాలన్న యోచనలో ఉంది జగన్ సర్కార్.
ఇకపోతే వైసీపీ అధిష్టానం తీరుతో తాను ఎన్నికల్లో పోటీ చేయనంటూ బహిరంగంగా ప్రకటించారు గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. మరోపక్క తాడేపల్లి వెళ్లిన మాగుంట ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. రెండు నిమిషాలు సాయిరెడ్డితో మాట్లాడి వెనువెంటనే తిరిగి వెళ్లిపోయారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని విజయసాయిరెడ్డిని కలిసినా కూడా.. అన్ని విషయాలు సీఎంతోనే మాట్లాడుతానని.. ఇతర నియోజకవర్గాల విషయాన్ని పట్టించుకోనని తేల్చేశారు.
ఇక ఎమ్మెల్యే సుధాకర్బాబు, కొండపి మాజీ ఇన్చార్జి వెంకయ్య.. విజయసాయిరెడ్డి ముందు తమ ఆగ్రహావేవాలను వెళ్లగక్కారు. మేరుగ నాగార్జున నోరు విప్పకపోగా.. ఆదిమూలపు సురేష్ తనకు గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. వైసీపీలో ముసలం ముదరడంతో రానున్న రోజుల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.