Jagan: వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోస్ట్ కమిటెడ్ పొలిటీషియన్. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొన్నా.. జైలుకెళ్లినా.. పాదయాత్ర చేసినా.. బంపర్ మెజార్టీతో సీఎం అయినా.. అది ఆయనకే సాధ్యమైంది. ఈసారి ఏకంగా 175కి 175 సీట్లు జగన్ టార్గెట్. జనాలకు కాస్త ఓవర్ గా అనిపించినా.. కాస్త కష్టపడితే సాధ్యమే అంటున్నారు వైసీపీ అధినేత. అందుకోసం.. ఎందాకైనా తగ్గేదేలే అంటున్నారు. సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమా. ప్రతిపక్షాలు చాలా బలహీనంగా ఉన్నాయనే లెక్క. ఈసారి గెలిచేస్తే.. వచ్చే 30 ఏళ్లు ఏపీలో అధికారం తనదేననే భావనలో ఉన్నారు జగన్. అందుకే, 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలేవిషయంలోనూ కాంప్రమైజ్ కావట్లే. అందుకు, ఇటీవలి పార్టీ సంస్కరణలే సాక్షంగా చూపిస్తున్నారు.
కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్. జగన్ కు రైట్, లెఫ్ట్ లాంటి వాళ్లు. ఫైర్ బ్రాండ్ లీడర్లు. అందుకే, వారిద్దరికీ మొదటి టర్మ్ లోనే మంత్రి పదవులు కట్టబెట్టారు. వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చేసి.. ప్రతిపక్షాలను ఫుల్ గా టార్గెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవల నుంచి పక్కనపెట్టేసినా.. వారికి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు అప్పగించి వారి ప్రయారిటీ అలానే ఉంచారు. కానీ.. ఫలితాలు సరిగా రాకపోవడంతో ఇప్పుడు వారిని పూర్తిగా పక్కనపెట్టేశారని అంటున్నారు.
నాని, అనిల్ అనే కాదు. సజ్జల, బుగ్గన లాంటి సాఫ్ట్ లీడర్లకూ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చారు జగన్. జగన్ కు నీడలా సజ్జల నిలిచారు. రాష్ట్ర ఆర్థిక భారమంతా బుగ్గన మోసారు. అలాంటి సమర్థులైన వారిద్దరూ.. ప్రాంతీయ సమన్వయకర్తలుగా జగన్ అనుకున్నమేరకు రాణించకపోవడంతో.. ఇప్పుడు వారిని కూడా ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
ఇలా, వాళ్లూ వీళ్లని కాదు.. తనకు దగ్గరి వాళ్లు.. హార్డ్ కోర్, సాఫ్ట్ కోర్ లీడర్లనే తేడా లేనే లేదు. గెలుపే లక్ష్యం. గెలుపే ధ్యేయం. 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లే టార్గెట్. అందుకోసం, ఎలాంటి మార్పులకైనా, చేర్పులకైనా సిద్ధం అంటున్నారు జగన్. పనికొచ్చే వారిని ఎక్కడ వాడుకోవాలో.. ఏ టైమ్ లో ఎవరిని ముందుంచాలో.. బాగా తెలిసిన నేత. అందుకే, ఎన్నికల ముందు బిగ్ టార్గెట్ తో దూసుకుపోతున్న జగన్.. పార్టీలో సంస్కరణలు చేశారు. అందులో భాగంగా సజ్జల, బుగ్గన, కొడాలి, అనిల్ లాంటి దగ్గరి వాళ్లను కూడా పక్కనపెట్టేశారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వారిని పార్టీని ఉరకలెత్తించే రేసుగుర్రాలుగా ముందుంచుతున్నారు. ప్రజలు తనను చూసి.. తన పథకాలను చూసి ఓటేస్తారు కానీ.. లీడర్లు ఎవరైతే ఏంటనేది అధినేత భావనలా ఉంది. టార్గెట్ 175 మాత్రమే జగన్ కు కనిపిస్తోంది.