Jagan: వైసీపీలో ఏం జరుగుతోంది? ఎందుకు నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు? నేతలకు అధినేత దూరంగా ఉండడమే కారణమా? ఈ పరిణామాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు అధినేత. నేపథ్యంలో పార్టీలోని కీలక నేతలతో మంతనాలు జరిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బెంగుళూరు నుంచి పులివెందులకు చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్. ఇటీవల మృతి చెందిన వైసీపీ నేత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పులివెందులకు వెళ్లారు. జిల్లాకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు జగన్.
రీసెంట్గా కడప జిల్లాలో పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు. వారితో దాదాపు అరగంటకు పైగానే చర్చించారు. గత ప్రభుత్వం సమయంలో చేసిన పనులకు సంబంధించి నిధుల కోసం కొందరు వచ్చినట్టు సమాచారం. త్వరలో నిధులు విడుదల అవుతాయని, కొద్దిరోజులు ఆగాలని చెప్పినట్టు నేతల మాట.
ALSO READ: విజయవాడలో విషాదం.. కొండచరియలు విరిగిపడి యువతి మృతి.. మరో ఇద్దరు ?
వైసీపీ ఈ మధ్యకాలంలో అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఒక వైపు ముంబై నటి వ్యవహారం.. మరోవైపు ఎంపీలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు.. ఇవన్నీ కలిసి అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నటి వ్యవహారంపై కొద్దిరోజులు సైలెంట్గా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు పొలిటికల్ సమాచారం.
నేతలు పార్టీని వదిలి వెళ్లిపోవడంపై సీరియస్గా దృష్టి పెట్టారు జగన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేసి వెళ్తే.. టీడీపీకి ఛాన్స్ ఇచ్చినవాళ్లు అవుతారని ఈ విషయంలో ఆలోచించాలని కొందరు నేతలతో అన్నట్లు తెలుస్తోంది. మనకు ఢిల్లీలో మనకు గౌరవం ఉందని, రాజ్యసభ, మండలిలో బలం తగ్గలేదని గుర్తు చేశారట. ఈ విషయంలో అధికార పార్టీలు మనపై ఆధారపడ్డాయని గుర్తు చేశారు.
సోమవారం వైఎస్ఆర్ వర్థంతి కావడంతో ఘాట్ వద్ద ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత సాయంత్రానికి తాడేపల్లి రానున్నారు. మంగళవారం విజయవాడ నుంచి యూకెకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత. తిరిగి సెప్టెంబర్ 25న తాడేపల్లికి రానున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలో మకాం వేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.