Jagan Diverted Centre Funds: కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో గ్రామీణ, పట్టణాభివృద్ధికి ఇచ్చిన నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. కేంద్రం తన వాటాగా వివిధ పథకాలకు విడుదల చేసిన మొత్తాలను నియమాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించింది. ఫలితంగా వైసీసీ హయాంలో ప్రారంభించిన వివిధ ప్రాజెక్టుల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేయించడం టిడిపి ప్రభుత్వానికి సవాలుగా మారింది.
స్థానిక సంస్థల్లో నిలిచిపోయిన పట్టణాభివృద్ధి పనులు పూర్తి చేయాలంటే రూ.5,192 కోట్లు అవసరమవుతాయి. మరోవైపు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పనులు పూర్తికి మరో రూ.5,500 కోట్లు కావాలి.
కొత్త రుణాలు దొరకడం కష్టమే
ముఖ్యమంత్రి చంద్రబాబు గత బుధవారం ఢిల్లీ టిడిపి ఎంపీలతో సమావేశమైన సమయంలో కేంద్ర పథకాల కోసం కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మళ్లించిన విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు ఇప్పటికే ఇచ్చిన నిధులకు కేంద్రం యూసీలు అడుగుతోందని.. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో కొత్త రుణాలు తీసుకోవాలంటే నిబంధనలు అడ్డొస్తున్నాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి పథకాల కేంద్ర నిధులను పూర్తిగా మళ్లించి జగన్ ప్రభుత్వం ఖాతాలు ఖాళీ చేసిందని గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పవన్కల్యాణ్ ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేసిన విషయం విదితమే. పట్టణ ప్రాజెక్టుల నిధులు మళ్లించి వైసీపీ మంత్రలు భ్రష్టు పట్టించారని పురపాలకశాఖ మంత్రి నారాయణ కూడా పలుమార్లు వ్యాఖ్యానించారు.
నిధులు ఎలా మళ్లించారు..
అమృత్ పథకం 1.0, 2.0 కింద లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.1,639.43 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో రూ.840.67 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం విడుదల చేసి.. మిగతా రూ.798.76 కోట్లు దారి మళ్లించేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఈ పథకాలకు ఇవ్వాల్సిన రూ.574.71 కోట్లు కూడా ఇవ్వలేదు. ఈ కారణంగా అనేక ప్రాజెక్టుల పనులు పెండింగ్ లో ఉండిపోయాయి.
అలాడే లక్షలోపు జనాభా గల 50 పట్టణాల్లో కూడా తాగునీటి సరఫరా ప్రాజెక్టుల కోసం చేపట్టిన ప్రాజెక్టుకు రూ.5,350.62 కోట్లు అవసరం. ఇందులో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఇచ్చిన రూ.333.76 కోట్ల రుణంలో రూ.89.47 కోట్లు మళ్లించేశారు. మిగిలిన నిధుల్లో రూ.244.29 కోట్లలో కాంట్రాక్టర్లకు రూ.103 కోట్ల బిల్లులు చెల్లించారు. మరో రూ.90 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదు. దీంతో రూ.3,487 కోట్ల రుణం ఇస్తామని చెప్పిన ఏషియన్ బ్యాంకు రూ.333.76 కోట్లు మాత్రమే ఇచ్చింది.
Also Read: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ
ఈ పథకాలకు అరకొర నిధులు మాత్రమే
జలజీవన్ మిషన్ పథకం కింద గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం తన 50 శాతం వాటా నిధులలో గత ఐదేళ్లలో రూ.10,978.18 కోట్లు కేటాయించింది. కానీ మిగిలిన 50 శాతం రాష్ట్ర వాటా నిధులు జగన్ ప్రభుత్వం అరకొర నిధులు ఇచ్చింది. ఈ కారణంగా కేంద్రం కూడా రూ.2,254.89 కోట్లు మాత్రమే విడుదల చేసింది.
ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో రూ.1,630.36 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది. పూర్తి చేసిన పనులకు రూ.500 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.
గ్రామాల్లో రహదారుల అభివృద్ధి ప్రాజెక్టును రూ.5,026 కోట్ల బ్యాంకు రుణ సాయం ఆధారంగా ప్రారంభించారు. దీన్ని కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రభుత్వ వాటా కింద ఇవ్వాల్సిన రూ.1,608 కోట్లలో కేవలం రూ.490 కోట్లే ఇచ్చింది. జగన్ ప్రభుత్వ తీరుతో బ్యాంకు కూడా ఇవ్వాల్సిన రూ.3,418 కోట్ల రుణంలో రూ.908 కోట్లు మాత్రమే ఇచ్చింది. రహదారుల ప్రాజెక్టులలో రూ.680 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది వైసీపీ ప్రభుత్వం. ఈ కారణాల వల్ల రహదారుల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.