Jagan foreign tour: ఎట్టకేలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విదేశాలకు వెళ్లేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది న్యాయస్థానం. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు యూకెలో ఉండనున్నారు. దీనిపై వారం రోజుల కిందట న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారాయన.
వైసీపీ అధినేత జగన్.. మరోసారి ఫారెన్ టూర్కు శ్రీకారం చుట్టారు. వచ్చే మంగళవారం విజయవాడ నుంచి బయలుదేరనున్నారు. ఈ ఏడాది విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి. ఎన్నికల పోలింగ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు. ఇప్పుడు రెండోసారి. వారం రోజుల కిందట విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా యూకె వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సెప్టెంబర్ మూడు నుంచి 25 వరకు బ్రిటన్కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రస్తావించారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు, ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే ఫారెన్ టూర్కు వెళ్లే ముందు టూర్ కు సంబంధించిన డీటేల్స్, ముఖ్యంగా ఫోన్ నెంబర్, ఈ మెయిన్ వంటివి న్యాయస్థానంతోపాటు సీబీఐకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
ALSO READ: వణికిన శ్రీకాకుళం జిల్లా.. రెండుసార్లు భూ ప్రకంపనలు..
జగన్కు కొత్త పాస్పోర్టుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జగన్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. జగన్ విదేశీ టూర్కు అధికార పార్టీ ఏమైనా అడ్డంకులు సృష్టిస్తుందేమోనని కొంత భయపడ్డారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. న్యాయ స్థానం అనుమతి ఇవ్వడంతో అందుకు ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు.
అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసు విచారణ మొదలు విదేశాలకు వెళ్లాలంటే జగన్తోపాటు కీలక నిందుతులంతా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కేసులో ఏ 2 విజయ సాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లనున్నారు. ఆయన కూడా అనుమతి పొందేందుకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీఎస్ఆర్ పిటిషన్పై తీర్పును ఈనెల 30కి వాయిదా వేసింది న్యాయస్థానం.
న్యాయస్థానం అనుమతి ఇస్తే.. సెప్టెంబర్, అక్టోబరులో యూకె, స్వీడన్, యూఎస్ విజయ సాయిరెడ్డి వెళ్లనున్నారు. జగన్ విదేశాల్లో ఉండగానే విజయసాయిరెడ్డి వెళ్లే చాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అంతా అనుకున్నట్లు యూకెలో జగన్ను వీఎస్ఆర్ సమావేశమయ్యే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో ఎన్నికల తర్వాత జగన్.. ముఖ్యనేతలను దూరంగా పెట్టినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో దేవాదాయ డిప్యూటీ కమిషనర్ వ్యవహారం.. వీఆర్ఎస్ చుట్టూ తిరిగింది. ఈ నేపథ్యంలో ఆయనను జగన్ దూరంగా పెట్టారనే వార్తలూ లేకపోలేదు.
ఏపీలో టీడీపీ సర్కార్ వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జోరుగా సాగుతోంది. ఆ పార్టీకి చెందిన పెద్ద తలకాయలున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని కొన్ని విభాగాలు, జిల్లా అధ్యక్షులను సైతం జగన్ మార్చారు. కడప జిల్లా బాధ్యతలను సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఆయన కొడుకు రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్ఛార్జ్గా నియమించారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గడికోట శ్రీకాంత్రెడ్డిని తప్పించి పార్టీలో కీలక పదవి అప్పగించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని నియమించారు. అంతేకాదు అనుబంధ విభాగాలను సైతం ఈయనకే అప్పగించారు.