CM Jagan news today(Political news in AP): ఏపీలో ఎన్నికలకు ఇక 10 నెలల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలో తిరగాలని ఏడాది క్రితమే ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు వద్దకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా సమీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సరిగా తిరగని నేతలకు నేరుగానే క్లాస్ తీసుకుంటున్నారు.
సీఎం వైఎస్ జగన్ బుధవారం మరోసారి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు పాల్గొంటారు. ఆ తర్వాత జగనన్న సురక్షా కార్యక్రమంపైనా చర్చిస్తారు. ఈ రెండు కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేస్తారు.
జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్షా కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. జూన్ 23 నుంచి జులై 23 వరకు జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.