Jagan Family: జగన్ ఫ్యామిలీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? కూటమి సర్కార్ పెడుతున్న కేసులకు బెంబేలెత్తుతోందా? వరస కేసులతో ఆ పార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. చాలా కేసులకు సంబంధించి జోరుగా విచారణ జరుగుతోంది. ముంబై నటి, మదనపల్లి ఫైల్స్, ఫైబర్ గ్రిడ్, ఇసుక-గనుల అక్రమాలు, సచివాలయాలకు సాక్షి పేపర్ వ్యవహారం వాటిపై దర్యాప్తు సాగుతోంది. అయితే సాక్షి పేపర్కు తమకు ఎలాంటి సంబంధాలు లేవని అంటున్నారు జగన్ దంపతులు.
అమరావతి రైతుల భూముల విషయంలో తన పరువుకు నష్టం కలిగించేలా వైసీపీ అధికారిక గెజిట్ ఓ వార్తను ప్రచురించింది. దీనిపై మంత్రి నారాయణ 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా జగన్, మిగతా నేతలను పేర్కొన్నారు. ఈ కేసును కొట్టి వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత. విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. జగన్కు సాక్షి పేపర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. ఈనెల 19న చంద్రబాబు కేబినెట్ సమావేశం జరిగింది. వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలుకు వైసీపీ సర్కార్ జీవో ఇచ్చింది. ఇందుకోసం 205 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తేలింది. వాలంటీర్ల ద్వారా పేపర్ కొనుగోలు చేయించి ఆ పత్రిక సర్క్యులేషన్ పెంచుకుంది. తద్వారా ప్రభుత్వ ప్రకటనలు ఒక్క సాక్షికి దాదాపు 403 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు ఆ శాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో ప్రకటన చేసిన విషయం తెల్సిందే.
ALSO READ: సనాతన ధర్మం జోలికి వస్తే వదిలేది లేదు.. ప్రకాష్ రాజ్ జాగ్రత్త : పవన్ వార్నింగ్
ఈ వ్యవహారం భారతి మెడకు చుట్టుకుందని భావించారు వైసీపీ పెద్దలు. వెంటనే ఆ పార్టీ గెజిట్లో ఓ వార్త వచ్చింది. దాని సారాంశం ఏంటంటే.. సాక్షి పత్రికకు భారతికి ఎలాంటి సంబంధం లేదని రాసుకొచ్చింది. సాక్షికి భారతి ఛైర్పర్సన్ కాదని, డైరెక్టర్ కాదని తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది. సాక్షి పత్రికకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నది జగన్ ఫ్యామిలీ వెర్షన్. కావాలనే సీఎం చంద్రబాబు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని రాసుకొచ్చింది.
మరోవైపు భారతి సిమెంట్స్ కంపెనీపై విచారణ చేయించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ కంపెనీలో జగన్ కుటుంబానికి 49 శాతం వాటా ఉంది. మిగతా 51 శాతం ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద ఉంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి భారీగా ఆర్డర్లు ఈ కంపెనీకి వెళ్లినట్టు టీడీపీ నేతల ఆరోపణ. తద్వారా సిమెంట్ రేటును పెంచి ప్రభుత్వ ఖనాజా నుంచి భారీ ఎత్తున నిధులు ఆ వెళ్లాయనే ప్రచారం సాగుతోంది. రేపటి రోజున ఈ సిమెంట్స్ కంపెనీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ ఫ్యామిలీ చెబుతుందా? లేదా అనేది చూడాలి.