Jagan: జగన్ పిలిచారు. కానీ, బాలినేని రాలేదు. మూడు రోజులు హైదరాబాద్లోనే మకాం వేశారు. ముఖ్యమంత్రి నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. ఓసారి వెళ్లొద్దాంటే అనుకున్నారో ఏమో.. బాలినేని శ్రీనివాసరావు తాడేపల్లికి వచ్చి వెళ్లారు. ఏ మైండ్ సెట్తో అయితే వచ్చారో.. జగన్తో భేటీ తర్వాత కూడా అదే నిర్ణయంతో వెళ్లిపోయారని చెబుతున్నారు. జగన్ బుజ్జగింపులు బాలినేనిపై పని చేయలేదు. రీజనల్ కోఆర్డినేటర్ పదవికి చేసిన రాజీనామాను విత్డ్రా చేసుకోలేదు. జగన్ బంధువు, ప్రకాశం జిల్లాలో కీలక నేత, అంగ అర్థబలం మెండుగా ఉన్న బలమైన నాయకుడు కావడంతో.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎపిసోడ్ వైసీపీలో ఏ టర్న్ తీసుకుంటుందోననే టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తోంది. బాలినేని.. జనసేనతో టచ్లో ఉన్నారనే టాక్ మరింత కలవరపెడుతోంది.
ఇంతకు ముందు కూడా ఓసారి బాలినేని ఇలానే అలిగారు. జగన్ పిలిపించుకుని బుజ్జగించారు. కొన్నాళ్లు నో ఇష్యూ. వరుస పరిణామాలతో ఈసారి బాలినేని సీరియస్గా హర్ట్ అయ్యారు. తనకు తగు గుర్తింపు లేని చోట.. తలొగ్గి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. అందుకే, దగ్గరి బంధువైన జగన్కే పదే పదే ఝలక్ ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఒకటి.. పార్టీలో అవమాన భారం. రెండేది.. రాజకీయ భవిష్యత్తుపై మరో ఉపాయం. అందుకే, ఇటీవల కాలంలో నిత్యం వార్తల్లో ఉంటున్నారాయన.
బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం జగన్కు దగ్గరి బంధువు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే కూడా. అధికారంలోకి రాగానే బాలినేనిని కీలక శాఖలకు మంత్రిని చేశారు సీఎం. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆయన పదవి ఫసక్ అంది. అప్పటి నుంచి బాలినేని బాగా ఫీల్ అయ్యారు. నా మంత్రి పదవే తీసేస్తావా అంటూ జగన్పై గుర్రుగా ఉన్నారు. తన జిల్లాకే చెందిన సురేష్ను మంత్రిగా కంటిన్యూ చేయడంతో మరింత రగిలిపోయారు. ఆయన అలకపూనిన విషయం తెలిసి.. తాడేపల్లికి పిలిపించుకుని మరీ బుజ్జగించారు సీఎం. అప్పటికి ఆ వివాదం కాస్త సద్దుమనిగినట్టు అనిపించింది.
ఇటీవల బాలినేనికి మళ్లీ సెగ తగిలింది. సీఎం పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు. మిగతా నేతలను వెళ్లనిచ్చి.. తనను మాత్రమే అడ్డుకోవడంతో ఈసారి మరింత హర్ట్ అయ్యారు. సీఎం ప్రోగ్రామ్లో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలిసి జగన్ వెనక్కి పిలిపించినా.. బాలినేని అంటీముట్టనట్టుగానే ఉన్నారు. తాడేపల్లి పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తనను పోలీసులు అడ్డుకున్నారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా వరుస పరిణామాల నేపథ్యంలో లేటెస్ట్గా శ్రీనివాసరెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల సమన్వయకర్తగా బాలినేని పని చేస్తున్నారు. ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి తెలిపారు బాలినేని. ఆ రాజీనామాను విత్డ్రా చేయించడానికే జగన్ మళ్లీ పిలిచారు. నేను రానంటూ.. ఆరోగ్యం బాగా లేదంటూ.. మూడు రోజులు మారం చేసిన బాలినేని.. ఎట్టకేళకు తాడేపల్లి వెళ్లారు. కానీ, జగన్ పూసిన వెన్నపూసకు కరిగిపోలేదు. రాజీనామాపై తగ్గేదేలే అన్నట్టు తెలుస్తోంది.
వాట్ నెక్ట్స్? బాలినేని మరో కోటంరెడ్డి అవుతారా? అంటే కాకపోవచ్చు. ఆయనలా రెబెల్ ఎమ్మెల్యేగా మిగలకపోవచ్చు. ఎంతకాదన్నా జగన్తో దగ్గరి బంధుత్వం ఉంది. అంతమాత్రాన తనకు వరుసగా అవమానాలు జరుగుతుంటే భరించే రకం కాదు బాలినేని. ఆర్థిక, అంగ బలం అధికంగా ఉన్న నాయకుడు కావడంతో.. ప్రకాశం జిల్లాలో ఆయన ఆధిపత్యానికి తిరుగు ఉండకపోవచ్చు.
పార్టీ పదవికైతే రాజీనామా చేశారు.. మరి, పార్టీకి కూడా వదిలేస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. బాలినేని జనసేన వైపు చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. పవన్తో టచ్లో ఉన్నారని టాక్. జిల్లా వ్యాప్తంగా తన వర్గానికి జనసేన తరఫున ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారని.. అధికారంలోకి వస్తే మంత్రి పదవిపైనా హామీ కోరుతున్నారని తెలుస్తోంది. తనను కేబినెట్ నుంచి తీసేసి అవమానించిన జగన్కు ఝలక్ ఇచ్చేందుకు బాలినేని పట్టుదలతో ఉన్నారని.. అందులో భాగంగానే ఇప్పుడు రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. ముందుముందు మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చని కూడా స్థానికంగా వినిపిస్తున్న మాట. మరి, బాలినేనికి, పవన్కి పడదుగా? పలు సందర్భాల్లో ఘాటుగా విమర్శించుకున్నారుగా? అనే అనుమానం అవసరం లేదు.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేగా.