Jagan Comments on Chandrababu(AP political news): ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. సీఎంగా పని చేసే వ్యక్తికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుందంటూ ఆయన గుర్తు చేశారు. అధికారం ఉంది కదా అని చంద్రబాబు విలువలకు తిలోదకాలు ఇచ్చి దారుణాలకు పాల్పడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ‘బుధవారం జరిగిన విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార పార్టీ అన్యాయంగా వ్యవహరించింది. మెజారిటీ లేని చోట ప్రలోభాలకు గురిచేశారు. పోలీసులతో భయపెట్టి ఓట్లు వేయించుకున్నారు. రాబోయే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి 600 మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉంది, టీడీపీకీ కేవలం 200 మంది ప్రజాప్రతినిధుల మద్దతు ఉన్నా కూడా పోటీకి సై అంటున్నది. ఎందుకంటే మెజారిటీ లేకున్నా దొడ్డి దారిన గెలిచేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు చాలా కీలకంగా ఉండబోతుంది. అధికార, ధనబలంతో చంద్రబాబు దారుణాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరినీ డబ్బుతో కొనలేరన్న సంకేతాలను ఈ ఎన్నికలతో చాటి చెప్పాలి.
Also Read: కందిపప్పు కోసం ఢిల్లీకి వచ్చాం: మంత్రి నాదెండ్ల
రాబోయే రోజుల్లో వైసీపీ శ్రేణులు ప్రజలకు మరింతగా చేరువై పని చేయాలి. అలా చేస్తే చంద్రబాబును ప్రజలే నామరూపాల్లేకుండా చేస్తారు. ఏపీలో జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా పలావు పెట్టాడు అంటారు. చంద్రబాబు గురించి అడిగితే బిర్యానీ పెడుతానంటూ మోసం చేశాడని అంటున్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది’ అంటూ చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.